వార్షిక బడ్జెట్‌ను ఆమోదించిన టీటీడీ పాలకమండలి

29 Feb, 2020 15:49 IST|Sakshi

సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2020-2021 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను రూపొందించింది. రూ.3,309 కోట్లతో వార్షిక బడ్జెట్‌కు టీటీడీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు టీటీడీ పాలకమండలి శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో బడ్జెట్‌ను ఆమోదించింది. బుందీపోటులో తరుచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వాటి నివారణకు రూ. 3.30 లక్షలను కేటాయించింది. అలాగే జూపార్క్‌ సమీపంలో ప్రతిభావంతుల భవన నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రూ. 34 కోట్లతో ఎస్వీ భజన పాఠశాల, అలిపిరి రోడ్డు విస్తరణకు రూ. 16 కోట్లు, బర్డ్‌ ఆస్పత్రిలో మెరగైన వైద్య చికిత్స, యంత్రాల కొనుగోలు కోసం రూ. 8.5 కోట్లను కేటాయించింది.

బడ్జెట్‌లో భాగంగా టీటీడీ విజిలెన్స్‌ శాఖలో సెక్యూరిటీ గార్డ్‌ పోస్టుల భర్తీకి కూడా పాలకమండలి ఆమోద ముద్ర వేసింది. చెన్నైలో పద్మావతి ఆలయ నిర్మాణానికి రూ. 3.92 కోట్లు కేటాయిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణం, పుష్కరిణి, వాహన మండపం నిర్మాణానికి ఆమోదం లభించింది. అలాగే టీటీడీ ఆలయాలు, పబ్లిక్‌ ప్రాంతాల్లో 1500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. టీటీడీ ఆధ్వర్యంలో జమ్మూకశ్మీర్‌, ముంబై, కాశీలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. అలాగే టీటీడీ సైబర్‌వింగ్‌ను కూడా ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వార్తలు