ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

3 Aug, 2019 08:23 IST|Sakshi
 మాట్లాడుతున్న టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌. పక్కన తిరుమల ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి, తిరుపతి జేఈవో బసంత్‌కుమార్, సీవీఎస్‌వో గోపీనాథ్‌ జెట్టి

69, 254 టికెట్లు విడుదల 

ఈ నెల 13, 27 తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు

వచ్చే నెల 30 నుంచి అక్టోబర్‌ 8 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు

టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడి

సాక్షి, తిరుమల : శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన నవంబర్‌ నెల కోటా కింద మొత్తం 69,254 టికెట్లను శుక్రవారం ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 10,904 సేవా టికెట్లు విడుదల చేశామని.. ఇందులో సుప్రభాతం 7,549, తోమాల 120, అర్చన 120, అష్టదళ పాద పద్మారాధన 240, నిజపాద దర్శనం 2,875 టికెట్లు ఉన్నాయని ఆయన మీడియాకు వివరించారు. ఆన్‌లైన్‌ జనరల్‌ కేటగిరిలో 58,350 సేవా టికెట్లు ఉన్నాయని.. వీటిలో విశేష పూజ 1,500, కల్యాణం 13,300, ఊంజల్‌ సేవ 4,200, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 14,850, సహస్ర దీపాలంకార సేవ 16,800 టికెట్లు ఉన్నాయన్నారు. కాగా, ఈనెల 13, 27 తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు.. 14, 28 తేదీల్లో ఐదేళ్లలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

సెప్టెంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 8 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు సింఘాల్‌ వివరించారు. కాగా, ప్లాస్టిక్‌ నివారణలో భాగంగా ఈ నెల మూడో వారం నుంచి తిరుమలలో అందరికీ జనప నార బ్యాగులను అందుబాటులోకి తీసుకువస్తామని ఈవో చెప్పారు. టీటీడీ తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. సామాన్య భక్తుల సౌకర్యార్థమే బ్రేక్‌ దర్శనాల కేటగిరీలను రద్దు చేశామని తెలిపారు. దీని వల్ల గంట సమయం ఆదా అవుతుందని, తద్వారా దాదాపు 5వేల మంది సామాన్య భక్తులకు అదనంగా దర్శనం చేయించేందుకు వీలవుతుందని చెప్పారు. ఈ సమావేశంలో తిరుపతి జేఈవో బసంత్‌కుమార్, సీవీఎస్‌ఓ గోపీనా«థ్‌ జెట్టి, ఇన్‌చార్జి సీఈ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

9 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘మనగుడి’
ఈ నెల 9 నుంచి 15 వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ఆలయాల్లో మనగుడి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ‘డయల్‌ యువర్‌ ఈఓ’ కార్యక్రమంలో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. 9న తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్న నేపథ్యంలో మహిళలకు సౌభాగ్యం పేరిట కుంకుమ, గాజులు, కంకణాలు పంపిణీ చేస్తామన్నారు. కాగా, తిరుమలలో 124 రోజులకు సరిపడా నీటి నిల్వలున్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. అలాగే, గత ఏడాది జూలైలో హుండీల ద్వారా శ్రీవారికి రూ.102.88కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది అదే నెలలో రూ.109.60కోట్లు వచ్చిందని ఈవో వివరించారు.

మరిన్ని వార్తలు