శ్రీవారి ఆభరణాల ప్రదర్శనకు బ్రేక్‌!

25 Jun, 2018 13:05 IST|Sakshi

ఆభరణాల ప్రదర్శనను వ్యతిరేకిస్తున్న ఆగమసలహాదారులు

వెనుకకు తగ్గిన టీటీడీ

సాక్షి, తిరుమల : కలియుగ ప్రతక్ష దైవం శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి  ఆభరణాల ప్రదర్శనపై టీటీడీ వెనుకకుతగ్గింది. శ్రీవారి ఆభరణాలు ప్రదర్శించాలని మొదట టీటీడీ భావించినప్పప్పటికీ.. ఇందుకు ఆగమసలహా మండలి సభ్యులు ఒప్పుకోలేదు. శ్రీవారి ఆభరణాల ప్రదర్శణను ఆగమ సలహాదారు సుందరవదన భట్టాచార్య తీవ్రంగా వ్యతిరేకించారు. శ్రీవారి ఆభరణాలు అత్యంత పవిత్రమైనవని, వాటికి విలువ కట్టలేమని ఆయన అన్నారు. ఆభరణాలను ప్రదర్శిస్తే.. వాటి భద్రత బాధ్యత  ఎవరిదని ఆయన ప్రశ్నించారు. పింక్ డైమండ్ తాను చూడలేదని సుంధరవదన భట్టాచార్య తెలిపారు. టీటీడీ రికార్డులో ఉన్న ప్రకారం ఆభరణాలన్నీ ఉన్నాయని చెప్పారు. అయితే, టీటీడీ ఏర్పడకముందే స్వామివారికి చెందిన అనేక ఆభరణాలు కనుమరుగయ్యాయని చెప్పారు.

శ్రీవారి ఆభరణాల ప్రదర్శనను ఆగమ పండితులు సైతం వ్యతిరేకిస్తున్నారని,  గర్భాలయంలో ఉంటేనే ఆభరణాలకు భద్రత లభిస్తుందని ఆగమ సలహాదారు సుంధరవదన భట్టాచార్య తెలిపారు. అనాదిగా ఆలయంలోనే ఆభరణాలకు మరమత్తులు చేపడుతున్నామని చెప్పారు. శ్రీవారి నిత్య సేవలు ప్రత్యక్ష ప్రసారం ఇస్తామన్న ఈవో వ్యాఖ్యలను సైతం ఆగమ సలహాదారులు ఖండించారు. ఆగమ సంప్రదాయానికి వ్యతిరేకంగా చేపట్టే ఎలాంటి కార్యక్రమాలనైనా వ్యతిరేకిస్తామని ఆగమ సలహాదారులు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు