తాత్కాలికంగా శ్రీవారి దర్శనం రద్దు

20 Mar, 2020 02:37 IST|Sakshi

సాక్షి, తిరుమల : కోవిడ్‌–19 వైరస్‌ను అరికట్టడంలో భాగంగా శ్రీవారి ఆలయంలోకి ఈ నెల 20వ తేదీ శుక్రవారం ఉదయం నుంచి భక్తుల ప్రవేశాన్ని వారం రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం సాయంత్రం అదనపు ఈవో ధర్మారెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిలతో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తిరుమలలో ఉన్న భక్తులందరికీ శ్రీవారి దర్శనం కల్పించి అనంతరం ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తామన్నారు. ప్రతి నిత్యం స్వామి వారికి నిర్వహించే కైంకర్యాలు యథాతథంగా కొనసాగుతాయని, అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తారని చెప్పారు.  

మరిన్ని వార్తలు