తిరుమలలో మరిన్ని సంస్కరణలు

8 Oct, 2019 04:54 IST|Sakshi

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడి

తిరుపతి ఎడ్యుకేషన్‌: కలియుగ ప్రత్యక్ష దైవమైన గోవిందుడు అందరివాడని, స్వామి దర్శనంలో పేద, ధనిక తేడా చూడకూడదని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుమలలోని తన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి దర్శనంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామన్నారు. అలాగే, స్వామివారిని త్వరగా దర్శించుకునేలా, భక్తులకు మెరుగైన వసతుల కల్పనకు మున్ముందు మరిన్ని సంస్కరణలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వీఐపీలకు సంబంధించి ప్రోటోకాల్, నాన్‌ ప్రోటోకాల్‌ దర్శనాలను తీసుకొచ్చి దళారీ వ్యవస్థను తగ్గించగలిగామని చెప్పారు.

సర్వదర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు వసతి సౌకర్యాలు పెంచే అంశంపై దృష్టిసారిస్తున్నామని.. ఇందులో భాగంగా తిరుపతిలో మినీ టౌన్‌షిప్స్‌ ఏర్పాటుకు యోచిస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కాగా, బాలాజి రిజర్వాయర్‌ నుంచి పైప్‌లైన్‌ ద్వారా తిరుమల నీటి అవసరాలు తీర్చేందుకు చర్యలు తీసుకోనున్నామని, అంతేకాక.. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలకు మరో వంద కోట్లు బడ్జెట్‌ను పెంచనున్నట్లు చైర్మన్‌ తెలిపారు. సుమారు 15వేల మంది కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ ఉద్యోగుల వేతనాల పెంపుపై సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. 

మరిన్ని వార్తలు