హైదరాబాద్: ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాస్తే కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు ఉలుకెందుకని పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి ప్రశ్నించారు.
హోదా అమలు చేయాలని లేఖ రాయడాన్ని తప్పుపట్టడం గర్హనీయమన్నారు. హోదా విషయమై చట్టంలో ఎందుకు పొందుపరచలేదని, ప్రణాళిక సంఘం ఆమోదం ఎందుకు తీసుకోలేదని అప్పటి ప్రభుత్వాన్ని వెంకయ్యనాయుడు ప్రశ్నించడంలో అర్థం లేదన్నారు. ఇప్పటి వరకు ప్రత్యేకహోదా అమలవుతున్న 11 రాష్ట్రాల్లో దేనికీ చట్టంలో పొందుపరచలేదని అడిగారు. ఆ విషయాన్ని నిజంగానే చట్టంలో పొందుపరచాలంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తున్నా చట్టం ఎందుకు చేయలేదన్నారు. యూపీఏ అధికారంలోకి వచ్చి ఉంటే 2014 జూన్ 2 నుంచే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలయ్యేదని ఆయన పేర్కొన్నారు.