ఇద్దరు చిన్నారుల ఉసురు తీసిన ఈత సరదా

16 Apr, 2018 12:46 IST|Sakshi
మణిదీప్‌ మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు, జయదేవ్‌ మృతదేహం వద్ద.. 

పర్చూరు : ఈత సరదా ఇద్దరు పిల్లల ఉసురు తీసింది. ఈ సంఘటన పెద్దివారిపాలెంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన ఐదో తరగతి చదువుతున్న రావి మణిదీప్‌ (11), ఎనిమిదో తరగతి చదువుతున్న కొల్లా జయదీప్‌ (14)లు కుంటలో పడి మృతి చెందారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. మణిదీప్, జయదీప్‌లు మరో ముగ్గురు పిల్లలతో కలిసి పెద్దివారిపాలెం శివారులోని నీటి కుంటకు ఈత కొట్టేందుకు వెళ్లారు. తొలుత మణిదీప్‌ నీటిలో దిగాడు. ఈత రాక మునిగిపోతుండటంతో రక్షించేందుకు జయదీప్‌ ప్రయత్నించాడు.

ఇద్దరూ నీటిలో మునిగిపోతూ కేకలు వేస్తుండటంతో మిగిలిన పిల్లలు భయపడి కేకలు వేసుకుంటూ గ్రామంలోకి వెళ్లి పెద్దలకు చెప్పారు. గ్రామస్తులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని కుంటలో పడి ఉన్న ఇద్దరినీ బయటకు తీసి వెంటనే పర్చూరు సీహెచ్‌సీకి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మణిదీప్, జయదీప్‌లు మృతి చెందినట్లు నిర్ధారించారు. పిల్లల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. వీఆర్వో మణిక్యం పంచనామా నివేదికను తహసీల్దార్‌కు సమర్పించారు.  

మరిన్ని వార్తలు