08922-236947తో కలెక్టరేట్లో కంట్రోల్రూం ఏర్పాటు
వేటకు వెళ్లవద్దని
మత్స్యకారులకు హెచ్చరిక
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో కలెక్టర్ ఎంఎం నాయక్ అధికారులను అప్రమత్తం చేశారు. వేటకు వెళ్ల రాదని మత్స్యకారులను హెచ్చరించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. దీనికి 08922-236947 నంబర్ను కేటాయించారు. 24 గంటలూ విధులు నిర్వహించాలని సిబ్బందికి ఆదేశించారు. కలెక్టరేట్లోని డీ సెక్షన్లో షిఫ్టుల వారీగా సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు సూపరింటెండెంట్ అప్పలనర్సయ్య తెలిపారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే కలెక్టరేట్లోని కంట్రోల్ రూం నంబర్కు సమాచారమివ్వాలని కోరారు.
జిల్లాలో మూడు రోజులుగా చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.కుండపోత జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 241.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడున్నర గంటల వరకూ ఏకదాటిగా వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా విజయనగరం పట్టణంలో ప్రజలకు ఇళ్లుకు పరిమితమయ్యారు. విజయనగరం, ఎస్.కోటలలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పార్వతీపురంలో రాత్రి భారీగా వర్షం కురిసింది.