రెండురోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం

5 Jan, 2020 17:36 IST|Sakshi

వైకుంఠ ఏకాదశి సందర్బంగా భారీగా ఏర్పాట్లు

భక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలుగకుండా చర్యలు

20వ తేదీ నుంచి శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికీ ఉచిత లడ్డూ

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనానికి ఈ ఏడాది రెండురోజులపాటు అనుమతి ఇస్తామని, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాడు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. అందరికీ ఉచిత లడ్డు ప్రతిపాదనపై పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని, జనవరి 20 నుంచి స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికీ ఉచిత లడ్డు ఇవ్వనున్నట్టు తెలిపారు. టీటీడీ పాలకమండలి భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనం ఎన్ని రోజులు పెట్టాలనే అంశంపై టీటీడీ పాలక మండలి అత్యవసరంగా సమావేశమైంది. ఉత్తర ద్వారా దర్శనం ఎన్ని రోజులు పెట్టాలనే అంశంపై అత్యవసర సమావేశం పెట్టామని ఆయన తెలిపారు. ఉత్తర ద్వారాలు పది రోజులు తెరవడంపై కమిటీ నియమించామని, కమిటీ నివేదిక ఆధారంగా వచ్చే ఏడాది దీనిని అమలు చెయ్యాలా? లేదా? అన్నది నిర్ణయిస్తామని తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు తిరుమల కొండపైకి చేరుకున్నారని, భక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలుకుండా ఏర్పాట్లు చేశామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం తెల్లవారుజామునుంచే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని తెలిపారు.

మరిన్ని వార్తలు