పడవ బోల్తా: ఇద్దరు మృతి

3 Dec, 2015 19:44 IST|Sakshi

బాపట్ల టౌన్ (గుంటూరు జిల్లా) : బాపట్ల సమీపంలోని సూర్యలంక సముద్ర తీరంలో గురువారం పడవ బోల్తాపడిన ఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందారు. సముద్రంలో అలలు ముంచెత్తడంతో నల్లమోతు రత్నబాబు (30), గురజాల లక్ష్మీనారాయణ (40) మృత్యుఒడికి చేరారు. స్థానికుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా కాకుమానుకు చెందిన ఎనిమిది మంది సూర్యలంక తీరంలో కార్తీక స్నానాలు ఆచరించేందుకు వచ్చారు. వీరంతా సూర్యలంక సమీపంలోని పేరలి డ్రెయిన్ మీదుగా పడవపై విహారయాత్రకు బయలుదేరారు.

ఇందుకోసం స్థానికంగా మత్స్యకారులకు రూ.1000 చెల్లించారు. పడవలో సూర్యలంక పొగురు సమీపంలోకి వెళ్లేసరికి ఒక్కసారిగా వెంటవెంటనే వచ్చిన అలలు పడవను ముంచెత్తాయి. దీంతో పడవ బోల్తాపడి ఎనిమిది మంది సముద్రంలో పడిపోయారు. గమనించిన మత్స్యకారులు ఆరుగురిని రక్షించారు. మిగిలిన రత్నబాబు, లక్ష్మీనారాయణ మృత్యువాత పడ్డారు. మృతదేహాలను బాపట్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు