ఐజీగా జేసీపీ రమణకుమార్‌.. డీఐజీగా డీసీపీ కాంతిరాణా

23 Jan, 2018 20:01 IST|Sakshi

సాక్షి, అమరావతిబ్యూరో : విజయవాడ పోలీస్‌ కమిషరేట్‌ పరిధిలోని ఇద్దరు ఐపీఎస్‌ అధికారులకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ బీవీ రమణకుమార్‌కు ఐజీ హోదా లభించింది. డీసీపీ కాంతిరాణా టాటాకు డీఐజీగా పదోన్నతి కల్పించింది. సూపర్‌టైమ్‌ స్కేల్‌ ఐపీఎస్‌ అధికారులుగా వారికి పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీఐజీ హోదాతో రమణకుమార్‌ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్నారు. ఆయన గతంలో నెల్లూరు ఎస్పీగా, సీఐడీ ఎస్పీగా, టీటీడీ సెక్యూరిటీ అండ్‌ విజిలెన్స్‌ అధికారిగా పనిచేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆయన్ను ఐజీ హోదా కల్పించింది. ఆయన త్వరలో పదవీ విరమణ చేయనున్నారు.


విజయవాడ డీసీపీ కాంతిరాణా టాటాకు డీఐజీగా పదోన్నతి లభించింది. ప్రస్తుతం ఎస్పీ స్థాయి అధికారిగా ఉన్నారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన కాంతిరాణా 2004 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఆయన గతంలో వరంగల్, ఖమ్మంలో ఓఎస్డీగా, హైదరాబాద్‌లోని మాదాపూర్‌ డీసీపీగా చేశారు. అనంతరం కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఎస్పీగా విధులు నిర్వర్తించారు. విజయవాడ పోలీస్‌ కమిషరేట్‌ను అదనపు డీజీ స్థాయికి పెంచిన  ఎస్పీ స్థాయి అధికారులను డీసీపీలుగా కేటాయించారు. దీంతో కాంతిరాణా టాటా విజయవాడ డీసీపీగా నియమితులయ్యారు. ఆయనకు ప్రభుత్వం ప్రస్తుతం డీఐజీగా పదోన్నతి కల్పించింది.

మరిన్ని వార్తలు