గరివిడి (విజయనగరం) : వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు ఇద్దరు గొర్రెల కాపరులు కొట్టుకుపోయారు. ఈ ఘటన విజయనగరం జిల్లా గరివిడి మండలం రేగటి గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది. రేగటి గ్రామానికి చెందిన పైడితల్లి(60), త్రినాథ(25) అనే ఇద్దరు తమ గొర్రెలతో సోమవారం ఉదయం గడిగెడ్డ వాగు అవతలి వైపునకు వెళ్లారు.
అయితే మధ్యాహ్నం ఎగువన వర్షాలు పడటంతో ఏరు ఉధృతంగా ప్రవహిస్తోంది. సాయంత్రం గొర్రెలతో తిరిగి వస్తుండగా ఏటిలో ఒక్కసారిగా వచ్చిన వరద తీవ్రతకు పైడితల్లి, త్రినాథ కొట్టుకుపోయి మృతి చెందారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.