ప్రేమజంట ఆత్మహత్య

11 Apr, 2015 10:19 IST|Sakshi
ప్రేమజంట ఆత్మహత్య

గుంటూరు జిల్లా: పురుగుల మందు తాగి ఓ యువకుడు, యువతి మృతి చెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పాలపాడు రోడ్డులో  శనివారం ఉదయం జరిగింది. వివరాలు..రావిపాడు గ్రామానికి చెందిన మేడ శ్రీనివాసరావు (30) నాలుగు రోజులుగా తల్లిదండ్రులతో మాట్లాడకుండా, ఫోన్‌లోను అందుబాటులోకి రాకుండా ఉన్నాడు. కాగా, శనివారం శ్రీనివాసరావు, మరో అమ్మాయి శ్రావణి సంధ్య (23) తో కలిసి నరసరావుపేట మండలం పాలపాడు రోడ్డులో ఉన్న ఒక కాలువలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దీంతో పోలీసులకు అమ్మాయి ఆవనిగడ్డలో చదువుతున్నట్లుగా తెలిసింది. అంతేకాకుండా వారివద్ద ఉన్న ఫొటోల ఆధారంగా వారు తిరుపతికి వెళ్లి పెళ్లి చేసుకొని వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, వీరి ఆత్మహత్యలకు ప్రేమ వివాహమే కారణమా? లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువకుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
(నరసరావుపేట)

మరిన్ని వార్తలు