రూ.14 కోట్ల విరాళం ఇచ్చిన ఇద్దరు భక్తులు

9 Aug, 2019 19:19 IST|Sakshi

తిరుపతి : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుడికి భక్తులు పెద్ద మొత్తంలో విరాళాలు సమర్పిస్తుండటం అందరికి తెలిసిన విషయమే. తాజాగా అమెరికాకు చెందిన ఇద్దరు ప్రవాస భారతీయులు తిరుమల శ్రీవారికి 14 కోట్ల రూపాయలను విరాళాల రూపంలో అందజేశారు. వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని శుక్రవారం వీరు కుటుంబ సమేతంగా తిరుమలేశుడి దర్శనానికి వచ్చారు. ఈ నేపథ్యంలో రూ.14 కోట్లను డీడీ రూపంలో టీటీడీ స్పెషల్‌ ఆఫీసర్‌ ఏవీ ధర్మారెడ్డికి అందించారు. ఈ మొత్తాన్ని టీటీడీ ఆధ్వరంలోని వివిధ ప్రజా సంక్షేమ ట్రస్టులకు ఉపయోగించాలని వారు కోరినట్లు తెలిసింది. కాగా, ఈ ఇద్దరు ప్రవాస భారతీయులు ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు అందించడం ఇది రెండోసారి. గతేడాది జూలై నెలలో రూ.13.5 కోట్ల మేర విరాళాన్ని టీటీడీ సంక్షేమ నిధికి అందించినట్లు అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు