తెలంగాణ కోసం మరో ఇద్దరి బలిదానం

15 Feb, 2014 00:24 IST|Sakshi

మెదక్, కరీంనగర్, న్యూస్‌లైన్: తెలంగాణ రాదేమోనన్న మనస్తాపంతో శుక్రవారం  ఇద్దరు యువకులు బలిదానం చేసుకున్నారు.  మెదక్  జిల్లా కొల్చారానికి చెందిన మ్యాదరి విఠల్, యాదమ్మ దంపతుల పెద్ద కుమారుడు నరేష్(21) నర్సాపూర్‌లో డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం పార్లమెంట్‌లో జరిగిన సంఘటనలపై కలత చెందిన శుక్రవారం సాయంత్రం వరకు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా గడిపాడు. అనంతరం సూసైడ్ నోట్ రాసి.. విషపు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

 

అలాగే, కరీంనగర్ మండలం కొత్తపల్లికి చెందిన పెద్ది కనకయ్య  గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన ఘటనలను టీవీల్లో చూసి కలత చెందాడు. సీమాంధ్రలు వచ్చే తెలంగాణను అడ్డుకుంటున్నారని తీవ్ర మనస్తాపం చెంది గ్రామ శివారులోని రైల్వేట్రాక్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదిలాఉండగా, ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో విద్యార్థి ఎం.అజయ్ క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు.
 

మరిన్ని వార్తలు