హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్(ఏపీపీఎస్సీ) గా డాక్టర్ పిన్నమనేని ఉదయభాస్కర్ శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీపీఎస్సీ సిలబస్ మార్పుపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఏడాది పరీక్షల నిర్వహణ కోసం క్యాలెండర్ ను రూపొందిస్తామన్నారు. వసతులున్న భవనం దొరికితే ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని విజయవాడకు తరలిస్తామని ఉదయభాస్కర్ చెప్పారు.
కాగా గుంటూరు జిల్లా వెలంపాడుకు చెందిన ఉదయభాస్కర్ గతంలో జేఎన్టీయూకే ప్రొఫెసర్గా పని చేశారు. అదే విధంగా కాకినాడ, విజయనగరాల్లోని వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్గా, సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతిగా, విదేశీ విశ్వవిద్యాలయ సంబంధాల డెరైక్టర్గా పలు బాధ్యతలు నిర్వర్తించారు.