డాబాగార్డెన్స్: భారతీయ జనతాపార్టీ నగర అధ్యక్ష ఎన్నికకు ఒకే ఒక నామినేషన్ దాఖలైంది. అధ్యక్ష స్థానానికి ఎం.నాగేంద్ర ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. బీజేపీ నగర కార్యాలయంలో అధ్యక్ష ఎన్నికకు నాగేంద్ర ఆదివారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల స్క్రూటినీ అనంతరం సోమవారం ఎంవీపీ డబుల్రోడ్డులో ఉన్న ఐఐఏఎమ్ సెంటర్లో ఉదయం 10 గంటలకు జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో నగర అధ్యక్షునిగా ప్రకటించనున్నారు. ఎన్నికల అధికారిగా పైడా కృష్ణమోహన్, సహాయ ఎన్నికల అధికారిగా ఎస్విఎస్ ప్రకాష్రెడ్డి వ్యవహరించారు.
కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు పి.వి.నారాయణరావు, నగర ప్రధాన కార్యదర్శులు అప్పలకొండ యాదవ్, విల్లూరి మోహనరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నరేంద్ర ప్రకాష్, నగర కార్యదర్శి గుండు రఘుబాబు, ఉపాధ్యక్షులు దుర్గరాజు, వేదుల దక్షిణామూర్తి, దుర్గారావు, బొడ్డేటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. నాగేంద్ర బీజేపీలో గత 15 ఏళ్లుగా క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీలో అనేక పదవులు చేపట్టారు. బీజేపీ విశాఖ నగర కోశాధికారిగా, ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కౌన్సిల్ సభ్యునిగా పనిచేశారు. 2010-12 ఏడాదికి నగర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.