దర్జాగా అక్రమ లేఅవుట్లు  

28 Dec, 2019 11:33 IST|Sakshi
జిరాయితీ చెరువును కప్పేసి లేఅవుట్‌ వేసిన దృశ్యం

శ్రీకాకుళం అంతర్భాగంలో పచ్చ నేతల దందా 

గత ప్రభుత్వంలో చెలరేగిపోయిన నాయకులు 

చెరువును కప్పేసి, ప్రభుత్వ భూమిని ఆక్రమించి.. ప్లాట్లుగా విభజించి అక్రమ విక్రయాలు  

భూముల విలువ రూ.30 కోట్లకు పైమాటే 

ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండి  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కూత వేటు దూరంలో అక్రమ లేఅవుట్లు వేసినా.. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనా అప్పటి అధికారులు పట్టించుకోలేదు. ముడుపులకు కక్కుర్తి పడి కళ్లు మూసుకుని ఉండిపోయారు. నేతల ఒత్తిళ్లకు దాసోహమైపోయారు. అక్రమ లేఅవుట్లతో పచ్చనేతలు సొమ్ము చేసుకున్నారు. ఇష్టారీతిన విక్రయించేసి కొనుగోలుదారులను మోసగించారు. ఇందులో టీడీపీ కీలక నేతల హస్తం ఉంది. వారి ముసుగులో చోటా నాయకులు, ప్రజల్ని జలగల్లా పిండేసిన జన్మభూమి కమిటీ సభ్యులు రియల్‌ దందా చేశారు. గతంలో జరిగింది కాదా అని ప్రస్తుత అధికారులు చోద్యం చూస్తున్నారు. వాటికి సంబంధించి సరైన రికార్డుల్లేవని మౌనం దాల్చుతున్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్‌లో విలీనం కాబోతున్న చాపురం సిద్ధిపేటలో జాతీయ రహదారికి ఆనుకుని అనధికారికంగా మూడు లేఅవుట్లు వెలిశాయి. ఆర్‌.పార్థసారథి అనే వ్యక్తి నుంచి జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ చేసుకుని అల్లు నరసయ్య అనే ఆసామి లేఅవుట్‌ వేశారు. 193 (3), 194 (3), 195 (1)లో దాదాపు ఎకరా 15 సెంట్లలో లేఅవుట్‌ వేశారు. దాన్ని ప్లాట్లుగా విభజన చేసి విక్రయాలు జరిపేశారు.

అలాగే ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు తల్లి విజయమ్మ నుంచి రెడ్డి చిరంజీవి అనే టీడీపీ నేత కొనుగోలు చేసి, దాన్ని 14మందికి జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ పేరుతో  లేఅవుట్‌ వేసి విక్రయాలు జరిపేశారు. దీనికి కూడా అనుమతుల్లేవు. ఇదే రెడ్డి చిరంజీవి మరో లేఅవుట్‌ కూడా అనుమతి లేకుండా వేశారు. ఇందులో విశేషమేమిటంటే ప్రభుత్వ భూములు కలిసి ఉన్నాయి. ముఖ్యంగా అల్లు నరసయ్య వేసిన లేఅవుట్‌లో జిరాయితీ చెరువు కూడా కలిసి ఉంది. వాస్తవానికి చెరువును కప్పే అధికారం ఎవరికీ లేదు. సాగునీటికి ఉపయోగించాల్సిన చెరువును చదును చేసి ప్లాట్లుగా వేసేశారు. దీనికి నాలా ఉందని చెప్పడమే తప్ప దానికి సంబంధించిన రికార్డుల్లేవు. ఇదంతా గతంలో జరిగిందని ప్రస్తుత అధికారులు చెబుతున్నారు. నిబంధనల మేరకైతే చెరువు ఏదైనా కన్వర్షన్‌ చేసి, చదును చేసి లేఅవుట్లు వేయకూడదు. అప్పటి అ«ధికారులు ఎలా కన్వర్షన్‌ చేశారో వారికే తెలియాలి. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఉన్న అనధికార లేఅవుట్లకు ఆనుకుని ప్రభుత్వ రస్తా కూడా కలిసి ఉంది. అధికారులు పట్టించుకోకపోతే వాటిని కూడా అమ్మేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే, విక్రయాలు చేసేందుకు సిద్ధంగా చదును చేసి ఉంచారు. మొత్తానికి మూడు లేఅవుట్ల విలువ రూ.30 కోట్లు దాటి ఉంటుందని అంచనా.

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి  
లేఅవుట్‌ వేయాలంటే ముందు భూమిని కన్వర్షన్‌ చేసుకోవాలి. దానికి కొంత ఫీజు చెల్లించాలి. లేఅవుట్‌ అనుమతి తీసుకోవాలంటే 40 అడుగుల రోడ్లు వేయాలి. కాలువలు, బీటీ రోడ్లు వేయాలి. ఎకరా విస్తీర్ణం గల లేఅవుటైతే 10 శాతం భూమిని రిజర్వు చేసి ప్రభుత్వానికి అప్పగించాలి. ఎకరం దాటితే 15 శాతం భూమిని రిజర్వు చేయాలి. చెప్పాలంటే ఓపెన్‌ సైట్‌గా చూపించాలి. అలాగే విద్యుత్‌ పోల్స్‌ వేసి ఉంచాలి. అలాగే డిస్ట్రిక్‌ టౌన్‌ కంట్లీ ప్లానింగ్‌ అధికారి (డీటీసీపీ)కి ఎకరాకు రూ.1000 ఫీజు చెల్లించాలి. సెక్యూరిటీ డిపాజిట్‌ కింద స్క్వేర్‌ మీటర్‌కి రూ.4 చొప్పున ఎకరాకు రూ.16,187 చెల్లించాలి. అదే విధంగా లేఅవుట్‌ ప్లాన్‌ అనుమతి కోసం స్క్వేర్‌ మీటర్‌కి రూ.4 చొప్పున ఎకరాకు రూ.16,187 చెల్లించాలి. ఇవన్నీ ప్రభుత్వానికి ఎగ్గొట్టి, అనుమతి లేకుండా లేఅవుట్లు వేసి, కొనుగోలుదారులను టీడీపీ నేతలు ముంచేశారు. ఒక్క ఫీజుల కిందనే ప్రభుత్వానికి లక్షలాది రూపాయలు రావల్సి ఉంది. అలాగే రిజర్వు సైటు విలువ రూ.కోట్లలో ఉంటుంది. విక్రయాలకు వచ్చేసరికి చూస్తే రూ.30 కోట్లు దాటే అవకాశం ఉంది.  

చోద్యం చూస్తున్న అధికారులు..  
ముడుపుల కారణంగా గత అధికారులు ఎలాగూ పట్టించుకోలేదు. అనుమతి లేని లేఅవుట్‌ అని తెలిసినా, ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉందని కని్పస్తున్నా, చెరువును కప్పేసి లేఅవుట్‌ వేశారని స్పష్టమవుతున్నా ప్రస్తుత అధికారులు సైతం చోద్యం చూస్తున్నారు. అసలు జిరాయితీ చెరువుకు లేఅవుట్‌ వేసేందుకు అనుమతి ఎలా ఇచ్చారని అడిగితే అధికారుల వద్ద సమాధానం లేదు. ఇలాగే అధికారులు వదిలేసిన ఆ లేఅవుట్‌లకు ఆనుకుని చదును చేసి ఉన్న ప్రభుత్వ భూమిని మున్ముందు కన్పించకుండా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

 సాక్షి పరిశోధనతో కదలిక  
ఇక్కడ జరిగిన అక్రమ దందాపై ‘సాక్షి’ రెండు రోజులుగా పరిశోధన చేసింది. ఆక్రమణలు, జిరాయితీ చెరువు కప్పేసిన వైనం అధికారుల వద్ద వివరణ తీసుకునేందుకు యతి్నంచింది. ఇంకేముంది రెవెన్యూ, సర్వే అధికారులు కదిలారు. గురువారం ఆ లేఅవుట్‌ వద్దకు వచ్చి కొలతలు వేసే కార్యక్రమం చేపట్టారు. అవి అనధికార లేఅవుట్లేనని తేల్చి చెప్పారు. కొంతే ఆక్రమణకు గురైందని తెలిపారు. మిగతా ప్రభుత్వ భూమి ఆక్రమణలో లేదని, పక్కనే ఉందని చెప్పుకొచ్చారు.  

నివేదిక కోరుతాను  
చాపురం పంచాయతీలో వెలిసిన లేఅవుట్లపై ఆరా తీస్తున్నాను. ఇప్పటికే అధికారులు పంపించి సర్వే చేయించాను. వారిచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాను. జిరాయితీ చెరువుకు నాలా ఎలా ఇచ్చారో తెలుసుకుంటాను. తదుపరి ఏం చేయాలో చేస్తాను. అనధికార లేఅవుట్లపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయి.           
–ఐ.టి.కుమార్, తహశీల్దార్, శ్రీకాకుళం 

చెరువు గర్భం నాలాకు రికార్డుల్లేవు 
చాపురం సిద్ధిపేటలో పరిధిలో గల 60 సెంట్ల భూమికి సంబంధించి (చెరువు గర్భం)కు 2018లో నాలా కట్టినట్లు చెప్పుతున్నారే తప్ప దానికి సంబంధించిన రికార్డులు లేవు. ఈ భూములకు సంబంధించి కార్యాలయంలో పరిశీలించినా ఎటువంటి రికార్డులు దొరకలేదు.      
– ప్రకాశ్‌రావు, ఆర్‌ఐ, తహశీల్దార్‌

పంచాయతీ అప్రూవల్‌ లేదు.. 
చాపురం పరిధిలోని సిద్ధిపేటలో రియల్‌ ఎస్టేట్‌లుగా వెలసిన భూములకు సంబంధించిన పంచాయతీ అప్రూవల్‌ ఏమీ లేదు. ఒకవేళ రియల్‌ ఎస్టేట్‌గా వేయాలంటే ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. అక్కడ అటువంటి నిబంధనలు పాటించకుండా అడ్డగోలుగా రియల్‌ ఎస్టేట్‌లు వేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం.  
–అజయ్‌బాబు, చాపురం పంచాయతీ సెక్రటరీ  

మరిన్ని వార్తలు