విషజ్వరాల పంజా

14 Jun, 2015 01:11 IST|Sakshi

కంచిలి: మండలంలోని చిన్నశ్రీరాంపురం, సాలినపుట్టుగ గ్రామాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ రెండు గ్రామాల్లో దాదాపు 70 మంది జ్వరాల బారినపడ్డారు. ప్రభుత్వ వైద్యసేవలు అంతంతమాత్రంగా ఉండటంతో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నట్టు తెలిపారు. సుమారు పది రోజులుగా ఈ రెండు గ్రామాల్లో జ్వరాలు వ్యాప్తి చెందాయి. వాతావరణంలో వచ్చిన మార్పులే తీవ్రతకు కారణంగా భావిస్తున్నారు.
 
 చిన్నశ్రీరాంపురం గ్రామంలో సాగిపల్లి పద్మ, ఎర్ర నీలమ్మ, ఎర్ర నర్సింహులు, గజ్జి తులసీరావు, లండ కేశవరావు, తెలుకల బృందావన్ తదితరులతో క లిసి గ్రామమంతటా సుమారు 50 మంది వరకు పది రోజులుగా జ్వరాలతో అవస్థ పడుతున్నారు. వీరికి స్థానికంగా ఉన్న వైద్య సిబ్బంది ఎటువంటి సేవలందించకపోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో కంచిలి, సోంపేట, పలాస వంటి చోట్ల ప్రైవేటు ఆస్పత్రుల్ని ఆశ్రయిస్తున్నారు. ఒళ్లునొప్పులు కొందరికి, శరీరమంతా ఎరుపురంగు దద్దుర్లు మరికొందరికి ఏర్పడుతున్నాయని చెబుతున్నారు.
 
 సాలినపుట్టుగ గ్రామంలో..
 అదేవిధంగా మకరాంపురం పంచాయతీ పరిధి సాలినపుట్టుగలోనూ సుమారు 20 మంది వరకు జ్వరాల బారిన పడ్డారు. ఇక్కడ సాలిన మాధవరావు, అతని భార్య కేదారమ్మ, సాలిన జానకిరావు, అతని కుమార్తె శిరీష తదిత రులు జ్వరాలతో బాధపడుతున్నారు. ఈ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలవద్ద మక రాంపురం పీహెచ్‌సీ వైద్యసిబ్బంది ఆధ్వర్యంలో శనివారం వైద్య శిబిరం నిర్వహించారు. రోగులకు రక్త పరీక్షలు చేశారు. ఈ శిబిరం వద్దకు కేవలం ఆరుగురు రోగులే వచ్చి పరీక్షలు చేసుకొన్నట్లు సిబ్బంది తెలిపారు. గ్రామంలో ఉన్న రోగుల్ని సంప్రదించగా పది రోజులుగా కుటుంబాలతో సహా జ్వరాలతో బాధపడుతున్నామని, కంచిలిలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకొంటున్నామని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి రెండు గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 

మరిన్ని వార్తలు