ఈ పాలనలో ఉద్యోగాల్లేవన్నా..

17 Jul, 2018 03:26 IST|Sakshi
ఈ అంబులెన్స్‌లో ఉన్న యువకుడి పేరు నీలం శ్రీనివాస్‌. తూర్పుగోదావరి జిల్లా పెదపూడికి చెందిన ఇతను సామర్లకోట మండలం రాగంపేటలోని శ్రీచక్ర పేపర్‌ మిల్లులో ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నీషియన్‌గా పనిచేసేవాడు. విధి నిర్వహణలో కిందపడటంతో వెన్నెముక దెబ్బతింది. అప్పటి నుంచి భుజం కింది భాగమంతా స్పర్శ లేదు. కదల్లేని స్థితిలో ఉన్నాడు. యాజమాన్యం, ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ పరిస్థితిలో తన సమస్యను జననేత జగన్‌కు చెప్పుకోడానికి తల్లితో కలిసి పాదయాత్ర ప్రాంతానికి సోమవారం అంబులెన్స్‌లో వచ్చాడు. కన్నీటి పర్యంతమవుతూ తన కుమారుడి పరిస్థితిని ఆ తల్లి జగన్‌కు వివరిస్తున్న దృశ్యమిది.

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట వాపోయిన నిరుద్యోగులు 

నోటిఫికేషన్లే రావడం లేదని ఆవేదన  

ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదని గోడు వెళ్లబోసుకున్న రైతులు 

అందరి కష్టాలు ఓపికగా వింటూ ధైర్యం చెప్పిన జననేత 

వర్షంలోనూ కొనసాగిన పాదయాత్ర 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ‘అన్నా.. ఏళ్లతరబడి ఎదురు చూస్తున్నాం.. ఉద్యోగ నోటిఫికేషన్లు అదుగో.. ఇదుగో.. అంటున్నారే కానీ వెలువరించడం లేదు. ఉన్నత చదువులు చదివినా నిరుద్యోగులుగా ఉండిపోయాము. ఎన్నికలప్పుడు చంద్రబాబు.. తాము అధికారంలోకి రాగానే ఇంటికో ఉద్యోగం గ్యారంటీ అన్నారు. లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇవాళ్టి వరకు ఏదీ లేదు. ఎన్నికలొస్తున్నాయని ఇప్పుడు నిరుద్యోగ భృతి అంటూ పాట పాడుతున్నారు. అది ఎంతమందికి ఇస్తారో.. ఎన్ని కొర్రీలేస్తారో తెలియదు’ అంటూ పలువురు నిరుద్యోగులు వైఎస్‌ జగన్‌ ఎదుట వాపోయారు.

ఈ నాలుగేళ్లలో డీఎస్సీ నిర్వహణకు ఒకే ఒక్క నోటిఫికేషన్‌ వచ్చిందని, ఇక ప్రభుత్వోద్యోగాల ఖాళీల భర్తీకి అవకాశమే లేకుండా పోయిందన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం 213వ రోజు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని పెద్దాడ, కైకవోలు సెంటర్, పెదపూడి, దోమాడలో పాదయాత్ర సాగించారు. మార్గం మధ్యలో పలువురు నిరుద్యోగులు జగన్‌ను కలిసి కష్టాలు చెప్పుకున్నారు.  వైఎస్సార్‌ సీపీకి మద్దతిస్తున్న వారికి అధికార పార్టీ నేతల   వేధింపులు పెరిగాయని పలువురు గోడు వెళ్లబోసుకున్నారు. అర్హత ఉన్నప్పటికీ పింఛన్లు, రేషన్‌కార్డులు ఇవ్వడం లేదని పలువురు ఫిర్యాదు చేశారు. ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ ధైర్యం చెబుతూ జననేత ముందుకు సాగారు.  

 జగనన్నొచ్చారు.. 
‘మా ఊరికి జగన్‌ వస్తున్నారు.. ఆయన్ను చూడాలి.. కలవాలి.. మాట్లాడాలి.. మన పనులు తర్వాత చూద్దాం...’ ఇదీ పాదయాత్ర సాగిన మార్గంలో ఉన్న ఊళ్లల్లోని జనం వరస. జగన్‌ తమ గ్రామానికి వస్తున్నారంటే వారందరిలో పండుగ వచ్చినంత సంబరం నెలకొంది. పండుగ రోజున సెలవు దినంతో ఎలా ఆటవిడుపుగా, ఆనందంగా ఉంటారో.. దాదాపుగా ఆ గ్రామాల్లో ప్రతి లోగిలిలోనూ ఇదే వాతావరణం కనిపించింది. జగన్‌ తమ ఊరికి వస్తున్నారని కొలువులకు సెలవు పెట్టిన వారు కొందరైతే, పని మీద ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ వాయిదా వేసుకున్న వారు మరికొందరు. ఇక కళాశాల, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కూడా ఆ పూట వెళ్లకుండా జగన్‌ కోసం వేచి ఉన్నారు. దారిపొడవునా ఆయన్ను చూడటానికి, మాట్లాడటానికి జనం పోటీ పడ్డారు.

మధ్యాహ్నం జననేత పెదపూడి వైపుగా అడుగులు వేసినప్పుడు వీధులన్నీ జనంతో కిక్కిరిశాయి. కిలోమీటరు దూరం వెళ్లడానికి  రెండు గంటలు పట్టింది. పెదపూడి దాటుతుండగా సన్నగా వర్షం మొదలైంది. అయినా జగన్‌ ముందుకు సాగారు.  పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు, వృద్ధులు, వివిధ వర్గాల వారు ఆయన్ను కలవడం కోసం వేచి ఉన్నారు. ఎవరినీ నిరాశ పరచకుండా వర్షంలో తడుస్తూనే జగన్‌ అందరితో మాట్లాడారు. ‘ఈ తడవ నువ్వు గెలవాలయ్యా.. కచ్చితంగా గెలుస్తావు..’ అంటూ దారిపొడవునా అవ్వాతాతలు దీవించారు.  కాగా, కేవీ హరీష్‌ దర్శకత్వంలో పృధ్విరాజ్‌ ప్రధాన పాత్రదారుడిగా నిర్మితమవుతున్న ‘మైడియర్‌ మార్తాండ’ సినిమా టీజర్‌ను గొల్లలమామిడాడలో జగన్‌ విడుదల చేశారు.    

వైఎస్‌కు పేరొస్తుందని ఇళ్లు నిర్మించ లేదు  
వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పెదపూడి గ్రామంలో 12 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి పేదలకు పంచేందుకు ఏర్పాట్లు చేశారు. అర్హులైన పేదలు 304 మందికి పట్టాలు కూడా పంపిణీ చేశారు. ఆయన మరణం తర్వాత ఆ స్థలంలో ఇళ్ల నిర్మాణాలు జరగలేదు. వైఎస్‌ హయాంలో ఇచ్చిన పట్టాలను రద్దు చేసి, టీడీపీ వారికి అనుకూలంగా ఉన్న వారికి పట్టాలను మంజూరు చేశారు. ఆ ఇళ్ల స్థలాన్ని నేటికీ అభివృద్ధి చేయలేదు. ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. వైఎస్సార్‌ హయాంలో పట్టాలు మంజూరైన వారు నేటికి ఇళ్లు లేని పేదలుగానే ఉండిపోయారు. స్థల సేకరణ వైఎస్‌ హయాంలో జరిగింది కాబట్టి ఆయనకు ఎక్కడ పేరొస్తుందోనన్న ఆలోచనతో ఇళ్ల నిర్మాణం చేపట్టడం లేదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే ఎంతో మందికి సొంత ఇంటి కల నెరవేరేది. అప్పట్లో ఎంతో మంది పేదలు సొంతింటి వారయ్యారు. ఈ ప్రభుత్వం పేదలను పట్టించుకోవడం లేదు.  
– పెదపూడి వద్ద జగన్‌తో కానూరి వీరరాఘవులు  

జననేత ప్రకటనతో రైతుకు భరోసా  
రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రైతులకు ఎంతో మేలు చేశారు. ఆయన చనిపోయాక రైతులను పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు మీరు ప్రకటించిన నవరత్నాల్లో రైతు భరోసా రైతులకు పునర్జన్మలాంటిది. వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్, వడ్డీలేని రుణాలు, పెట్టుబడి కోసం రూ.12,500 సమకూర్చడం, ఉచితంగా బోర్లు వేయిస్తాననడంతో మాకు వ్యవసాయం మీద ఆశలు పెరుగుతున్నాయి. ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్‌ కరెంటు, రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, శీతలీకరణ గిడ్డంగుల ఏర్పాటు, పాడి రైతులకు లీటరుకు రూ.నాలుగు సబ్సిడీ, వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్‌ టాక్స్‌ రద్దు, రూ.4000 కోట్లతో ప్రకృతి, విపత్తుల సహాయక నిధి ఏర్పాటు.. ప్రమాదవశాత్తు చనిపోయిన, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, ఈ మొత్తాన్ని అప్పులు ఇచ్చిన వారు లాక్కోకుండా ప్రత్యేక చట్టం తెస్తామనడం.. ఇవన్నీ నిజంగా రైతులకు సంజీవినే.   
    – పెదపూడి వద్ద జగన్‌తో పడాల రామారెడ్డి, పందలపాక  

కేసులుపెట్టి హింసిస్తున్నారన్నా.. 
వైఎస్‌ కుటుంబాన్ని అభిమానిస్తున్నందుకు కేసులు పెట్టి హింసిస్తున్నారన్నా.. చంద్రబాబు అధికారంలోకి రాగానే 2015లో నాపైన, మా నాన్న సత్యనారాయణ, సోదరుడు లోవరాజు, మేనమామ గాజింగి వెంకటరమణ, అతని కొడుకు వీరబాబు మొత్తం ఐదుగురిపై అక్రమ కేసులు బనాయించారు. నిబంధనలకు విరుద్ధంగా రౌడీషీట్లను తెరిచారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక మా నాన్న బలవన్మరణం పొందారు. వైఎస్సార్‌సీపీ తరఫున మేనమామ వెంకటరమణ పనిచేయడం, అందుకు మా కుటుంబం సహకరించడమే మేము చేసిన నేరంగా టీడీపీ నేతలు కక్షగట్టారు. ఇతను పదేళ్లుగా సహపురం సర్పంచ్‌గా పనిచేస్తున్నారు. అయినా తప్పుడు కేసులు బనాయించారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధికే ఈ ప్రభుత్వం విలువనివ్వడంలేదు. ఇక సామాన్యుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. అధికార పార్టీకి మద్దతు పలికితేనే ప్రభుత్వ పథకాలను వర్తింపచేస్తున్నారు. లేదంటే పట్టించుకోవడం లేదు. చంద్రబాబు పాలన తీరు కక్షపూరితంగా ఉంది.   
 – పెదపూడి వద్ద జగన్‌తో కుటుంబ సభ్యులతో కలిసి రాయుడు మురళీకృష్ణ 

మరిన్ని వార్తలు