పేరడిగి.. కత్తితో దాడి

18 May, 2014 08:37 IST|Sakshi

సైదాబాద్: తెల్లవారు జామున టీ తాగడానికి రోడ్డుపైకి వచ్చిన విద్యార్థిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు.  సైదాబాద్ ఎస్‌ఐ రాజేష్‌కుమార్ తెలిపిన ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన యువకడు (23) దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయి డిగ్రీ కళాశాలలో చదువుకుంటూ స్థానిక ద్వారకాపురికాలనీలోని హాస్టల్‌లో ఉంటున్నాడు. ఖాళీ సమయంలో సంతోష్‌నగర్‌లోని హెరిటేజ్ ఫ్రెష్‌లో స్టోర్ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు.

శనివారం తెల్లవారు జామున 3 గంటలకు తనతో పాటు పని చేస్తున్న మరో యువకుడితో కలిసి టీ తాగేందుకు చౌరస్తాకు వచ్చాడు. అక్కడ టీ దొరక్క పోవడంతో సైదాబాద్ ధోబీఘాట్ చౌరస్తాకు నడుచుకుంటూ బయలుదేరారు.  అదే సమయంలో అక్కడికి రెండు బైక్‌లపై వచ్చిన ఐదుగురు దుండగులు సైదాబాద్ ఎక్కడ అని వీరిని హిందీలో ప్రశ్నించారు. ఆపై మీ పేర్లేంటని అడిగారు.

చెప్పగానే ఒకరి కడుపులో కత్తితో పొడిచి పారిపోయారు. కత్తి పిడి బాధితుడి కడుపులో అలాగే ఉండిపోయింది. వెంటనే 108 అంబులెన్స్‌లో అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు