నష్టపోయిన ఏపీకి  సాయం అందించండి

8 Nov, 2019 19:06 IST|Sakshi

కేంద్ర మంత్రిని కోరిన ఏపీ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్‌

సాక్షి, అమరావతి: విభజన ఫలితంగా ఆంధ్రప్రదేశ్ పలు విధాలుగా నష్టపోయిందని, రాష్ట్రం అభివృద్ధి కి అవసరమైన సహకారాన్ని అందించాలని ఏపీ గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌.. కేంద్ర ఇంధన వనరులు, సహజ వాయువులు, ఉక్కు శాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్‌ను కోరారు.  శుక్రవారం ఏపీ గవర్నర్‌ను  కేంద్రమంత్రి మర్యాద పూర్వకంగా కలిసారు. ఉదయం రాజ్ భవన్ చేరుకున్న ఆయన గవర్నర్ తో భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌  లోనే అల్పాహార విందును స్వీకరించిన కేంద్ర మంత్రి.. అనంతరం గవర్నర్ తో పలు అంశాలను చర్చించారు.

నిధులు,ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి..
ఈ సందర్భంగా రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరారు. ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ ఓఎన్‌జిసి కేజీ బేసిన్ ను సందర్శించాలని గవర్నర్ ను ఆహ్వానించారు. ఉక్కు శాఖను కూడా నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి విశాఖ ఉక్కు కర్మాగారానికి కూడా రావాలని హరిచందన్ ను కోరారు. ఇటీవల గవర్నర్ విశాఖపట్నంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఎనర్జీ సంస్థను సందర్శించగా, అక్కడ చేపట్టవలసిన అభివృద్ధి పనులపై కూడా వీరిరువురి మధ్య లోతైన చర్చ నడిచింది. కార్యక్రమంలో గవర్నర్  కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, రాజ్ భవన్ సంయుక్త కార్యదర్శి అర్జున రావు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు