సాక్షి, అమరావతి: దేశంలో ప్రస్తుతం రెండో దఫా లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై అనుసరిస్తున్న విధివిధానాల గురించి తెలుసుకునేందుకు సోమవారం సచివాలయంలోని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు కేంద్ర సహాయ మంత్రి కైలాష్ చౌదరి ఫోన్ చేసి సంభాషించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం సడలింపులపై ఆరా తీయగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కన్నబాబు వివరించి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల కోసం చర్యలు చేపట్టారని తెలిపారు.
అందులో భాగంగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేంద్రం ఇచ్చిన సడలింపులను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ధాన్యం, జొన్న, మొక్క జొన్న పంటల కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మార్కెటింగ్ శాఖ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామన్నారు. పండ్లకు కూడా ధర కల్పించడం కోసం సీఎం జగన్ చొరవ తీసుకున్నారని ప్రస్తావించారు. వ్యవసాయంతోపాటు పౌల్ట్రీ, ఆక్వా రంగాలకు కూడా కొన్ని సడలింపులు ఇచ్చి రైతులు నష్టపోకుండా కాపాడుతున్నామని కన్నబాబు పేర్కొన్నారు. (చేపల ఎగుమతికి సహకరించండి!)