ఆన్‌లైన్ అవస్థలు

10 Dec, 2013 04:12 IST|Sakshi
వంగర, న్యూస్‌లైన్: వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. కానీ అవి కంప్యూటర్‌లో కనిపించవు. కనిపించకపోవడానికి కార ణం.. రెవెన్యూ అధికారులు వాటిని ఆన్‌లైన్ చేయకపోవడ మే. ఆన్‌లైన్‌లో నమోదు కానిదే బ్యాంకు రుణాలు, ఇతరత్రా ప్రభుత్వ రాయితీలు అందవు. వంగర మండలం కొప్పర పంచాయతీ కె.కొత్తవలస గ్రామానికి చెందిన 104 మంది రైతులు ఇదే దుస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ విభాగాలన్నింటిలోనూ కంప్యూటరీకరణ జోరుగా సాగుతోంది. అందులో భాగంగా రైతుల భూముల వివరాలు కూడా కంప్యూటరీకరిస్తున్నారు. ఈ పని అరకొరగా జరగడంతో రైతులు కష్టనష్టాలకు గురవుతున్నారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం కె.కొత్తవలసే. 
 
 ఈ గ్రామంలో 255 మంది రైతులకు పల్లం, మెట్టు కలిపి 900 ఎకరాల భూములు ఉన్నాయి. ఇవ న్నీ తోటపల్లి కుడికాలువ పరిధిలో ఉన్నాయి. వీటికి భూమి శిస్తు కూడా చెల్లిస్తున్నారు. ఆఫ్‌లైన్ అడంగల్, రెవెన్యూ రికార్డు-01, రెవెన్యూ రికార్డు-04లలోనూ నమోదయ్యాయి. కానీ వీరిలో 205 మందికే పట్టాదారు పాసుపుస్తకాలున్నా యి. ఇదిలా ఉండగా గత ఏడాది మండలంలోని అన్ని గ్రామాలు, బౌండరీల వారీగా పట్టాదారు పాసుపుస్తకాలు, ఇతర రికార్డుల ఆధారంగా భూముల వివరాలను కంప్యూట రీకరించారు.కె.కొత్తవలసను మాత్రం విస్మరించారు. దాంతో కంప్యూటరీకరణ గురించి తెలుసుకున్న, దానిపై అవగాహన ఉన్న 151 మంది రైతులు నేరుగా కార్యాలయానికి వెళ్లి తమ భూములను కంప్యూటరీకరించుకున్నారు. 54 మంది రైతుల వివరాలు ఆన్‌లైన్ కాలేదు. మరో 50 మందికి పాసుపుస్తకాలే మంజూరు చేయలేదు. మొత్తం మీద గ్రామానికి చెందిన 350 ఎకరాల భూములు ఆన్‌లైన్ కాగా, మిగిలిన 550 ఎకరాల భూములు ఆఫ్‌లైన్‌లోనే ఉండిపోయాయి. 
 
 రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం
 రైతుల భూములన్నింటినీ కంప్యూటరీకరించాలని ప్రభుత్వం గత ఏడాది స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా అయితే అధికారులు అలసత్వం వహిస్తున్నారు. రైతుల వద్ద ఉన్న పట్టాదార్ పాస్ పుస్తకాలను పరిశీలించి, వారి భూముల వివరాలను కంప్యూటరీకరించాలి. అది పూర్తి అయిన తర్వాత మీ సేవ కేంద్రాల ద్వారా కంప్యూటర్ అడంగల్ తీసుకోవాలి. అది ఉంటే తప్ప రుణాలు మంజూరు కావు. ఇతర ప్రభుత్వ రాయితీలకు దరఖాస్తు చేసుకోలేరు. అయితే కె.కొత్తవల సలో రైతుల పాసుపుస్తకాలనే అధికారులు పరిశీలించలేదు. నేరుగా వెళ్లి ఆన్‌లైన్ చేయించుకున్న రైతులకు తప్ప మిగతా వారికి కంప్యూటర్ అడంగల్ కాపీలు లభించడం లేదు.
 
 రుణ సౌకర్యానికి నోచుకోని రైతులు
 తమ భూముల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడం తో 54 మంది రైతులు రుణ సౌకర్యానికి దూరమయ్యారు. అర్హులైన రైతులందరికీ రుణాలు ఇవ్వాలని అటు ప్రభుత్వం, ఇటు కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలు ఇక్కడ అమలు కావడం లేదు. గత ఏడాది ఈ రైతులంతా రుణాలకు అర్హత కోల్పోయారు. కొన్నేళ్లుగా పంట రుణాలు తీసుకున్న రైతులు వాటి ని రెన్యూవల్ చేసుకోలేక అవస్థలు పడుతున్నారు. రెన్యూవల్‌కు సైతం కంప్యూటర్ అడంగల్ అవసరం కావడంతో గత రెండేళ్లుగా పంట రుణాలు రెన్యూవల్ చేసుకోలేక అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన సున్నా వడ్డీ రాయితీ కూడా వీరికి వర్తించడం లేదు. 
 
 50 మంది రైతులకు పాసుపుస్తకాలే లేవు
 గ్రామంలో 50 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు లేవు. వంశపారంపర్య ఆస్తిగా సంక్రమించే భూముల యజమాని మరణిస్తే, ఆ భూములను వారి వారసుల పేరిట మార్చి కొత్త పాసుపుస్తకాలు మంజూరు చేయాల్సి ఉంది. దశాబ్దాల తరబడి ఈ గ్రామంలో ఆ పరిస్థితి లేదు. 
 
 నమోదు కాని సర్వే నెంబర్లు
 కొప్పర బౌండరీ పరిధిలో కంప్యూటరీకరణకు నోచుకోని భూముల సర్వే నెంబర్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ గ్రామానికి చెందిన 77, 113, 76, 301, 111, 10, 25 తదితర సర్వే నెంబర్ల పరిధిలో అధిక సంఖ్యలో రైతులకు చెందిన భూములు కంప్యూటరీకరించలేదు. కాగా కె.కొత్తవలస గ్రామానికి చెందిన కొంత మేర పంట భూములు మద్దివలస, కొండచాకరాపల్లి బౌండరీల్లో ఉన్నాయి. ఆయా గ్రామాల్లో సుమారు 27 మంది రైతులుండగా వారిలో 10 మంది వివరాలే ఆన్‌లైన్‌లో నమోదయ్యాయి. కొండచాకరాపల్లిలో 10, మద్దివలసలో ఏడుగురు రైతులకు సంబంధించి భూములు ఆన్‌లైన్ కాకపోవడం సమస్యగా మారింది. 
 
 ఏడాదిన్నర నుంచి వీఆర్వో లేరు
 సుమారు ఏడాదిన్నర నుంచి ఈ గ్రామ వీఆర్వో పోస్టు ఖాళీగా ఉంది. మిగిలిన అధికారులైనా ఇక్కడి సమస్యలపై దృష్టి సారించడం లేదు. దీంతో రైతులు ప్రతిదానికీ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. ఈ ఏడాది మేలో ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ఈ గ్రామం నుంచి 60 ఫిర్యాదులు అందాయి. తమ భూములను కంప్యూటరీకరించాలని, రికార్డుల్లో తప్పులు సరిచేయాలని, వారసత్వంగా అనుభవిస్తున్న భూముల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, కొత్తగా కొనుగోలు చేసిన భూములను కంప్యూటరీకరించాలని అర్జీలు పెట్టుకున్నా ఇంత వరకు ఒక్కటీ పరిష్కారానికి నోచుకోలేదు.
 
 అధికారులకు ఫిర్యాదు చేసినా..
 తమ సమస్యలపై రైతులు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం కనిపించలేదు. కలెక్టర్ గ్రీవెన్స్‌లోనూ, పాలకొండ ఆర్డీవోకు ఫిర్యా దు చేశారు. దీంతో సమస్య తెలుసుకునేం దుకు ఓ అధికా రి వచ్చి రైతుల వద్ద ఉన్న పాసుపుస్తకాలు చూసి వెళ్లిపోయారు. సమ స్య  మాత్రం పరిష్కారం కాలేదు. 
 
మరిన్ని వార్తలు