అనంతపురం టౌన్ :
ఉపాధి పనులను వంద రోజుల నుంచి 150 రోజులకు పెంచిన ప్రభుత్వం దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ను సిద్ధం చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉపాధి పనులు కల్పించనున్నారు.
జిల్లాలోని 63 మండలాలూ కరువు మండలాల జాబితాలో చేరినందున వలసల నివారణకు గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు పనిదినాలు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే అందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ అందుబాటులో లేకపోవడంతో అధికారులు పనులు కల్పించలేకపోయారు.
ప్రస్తుతం జిల్లాలో 7,87,727 జాబ్కార్డులు జారీ చేయగా 7,79,510 మంది కూలీలు ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 22 వేలకు పైగా కుటుంబాలు వంద రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్నాయి. ఆదివారం సాఫ్ట్వేర్ సిద్ధం కావడంతో వీరితోపాటు పనులు కావాలనే వారందరికీ 150 రోజులు పని కల్పించనున్నట్లు డ్వామా పీడీ నాగభూషణం తెలిపారు.