కాటేస్తున్న యురేనియం కాలుష్యం

7 Oct, 2019 12:42 IST|Sakshi
అఖిలపక్షం ఎదుట సమస్యలను చెప్పుకుంటున్న మహిళలు

భూమిలోకి ఇంకుతున్న టైలింగ్‌ పాండ్‌ వ్యర్థ జలాలు  

కలుషిత నీటితో పంటలుసాగుచేయలేకపోతున్నాం

రేడియేషన్‌ ప్రభావంతో రోగాలు  

అఖిల పక్షం ఎదుటబాధితుల ఆవేదన

వేముల/పులివెందుల : యురేనియం కాలుష్యం కాటేస్తోంది. ఇక్కడ బతకలేకున్నాం.టైలింగ్‌ పాండ్‌ వ్యర్థ జలాలు భూమిలోకి ఇంకిపోయి వ్యవసాయ బోర్లు కలుషితం కావడంతో పంటలు సాగుచేయడం లేదు.రేడియేషన్‌ ప్రభావంతో వ్యాధులు ప్రబలుతున్నాయని టైలింగ్‌పాండ్‌ పరిధిలోని గ్రామాల బాదిత రైతులు అఖిలపక్షం ఎదుట వాపోయారు. ఆదివారం మం డలంలోని కె.కొట్టాల గ్రామంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, టీడీపీ మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, భూమా అఖిలప్రియ, శాసన మండలి మాజీ వైస్‌ చైర్మన్‌ సతీష్‌రెడ్డిలతోపాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఓబుల కొండయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు తమ సమస్యలను, ఇబ్బందులను వారికి వివరించారు. కలషితనీటిని తాగడంతో శరీరంపై బొబ్బలు, దద్దులు వస్తున్నాయని..నవ్వలు, కడుపునొప్పి, చిన్నపిల్లల్లో కడుపునొప్పి ఎక్కువగా ఉంటుందని వాపోయారు. యూసీఐఎల్‌ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాలతో ఎలాంటి ప్రయోజనాలు లేవన్నారు. వైద్యులు పేరు తెలుసుకొని మందులు ఇస్తున్నారని..అన్ని రకాల వ్యాధులకు ఒకే రకాల మందులు ఇవ్వడం వలన వ్యాధులు తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు కలుషితమై పంటలు సాగుచేయలేక పొలాలను బీళ్లుగా ఉంచామని వివరించారు. గతంలో 200–300 అడుగుల లోతులో నీరు ఉండేదని..యురేనియం తవ్వకాలతో 1000–1500 అడుగుల వరకు బోర్లు వేయాల్సి వస్తుందని విన్న వించారు. అరటి సాగుచేస్తే కలుషిత నీటిని ఇవ్వడంవల్ల పంట దెబ్బతిని సాగులో పెట్టుబడులు కూడా రావడంలేదని..సాగుకు తెచ్చిన అప్పులు తీర్చలేక సతమతమవుతున్నామన్నారు.

సమస్యలను పట్టించుకోని యూసీఐఎల్‌  
ఏడాదిన్నరగా సమస్య ఉన్నా యూసీఐఎల్‌ పట్టించుకోవడంలేదన్నారు. టైలింగ్‌ ఫాండ్‌ వ్యర్థ జలాలతో సాగునీరు కలుషితమై జీవనాదారమైన వ్యవసాయాన్ని వదులుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. యురేనియం గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ కమిటీ ఏర్పాటు చేసిన ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. గాలి, నీరు, భూమి కలుషితమై ఇక్కడ జీవనం సాగించలేక గ్రామాలను వదలి వెల్లాలని నిర్ణయించుకున్నామని బాధిత గ్రామస్తులు అఖిల పక్షం ఎదుట వాపోయారు. అక్కడ నుండి అఖిల పక్షం సభ్యులు సమీపంలోని రామ్మోహన్‌ అనే రైతుకు చెందిన చామంతి తోటను పరిశీలించారు. అలాగే టైలింగ్‌ఫాండ్‌ సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. 

జాతీయ స్థాయిలో ఉద్యమం  
యురేనియం తవ్వకాలను నిలిపి వేయాలని జాతీయస్థాయిలో ఉద్యమం చేపడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. మండలంలోని కె.కొట్టాల గ్రామంలో బాధిత రైతులతో వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. టైలింగ్‌ఫాండ్‌ సం దర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టైలింగ్‌ఫాండ్‌ వ్యర్థ జలాలు భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాలు కలుషితం కావడంతో పంటలు సాగుచేసుకొనే పరిస్థితులు లేవన్నారు. కలుషిత నీటితో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ  యూసీఐఎల్‌ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కాలుష్యంతో వ్యా« దులు ప్రభలుతున్నాయని..యురేనియం తవ్వకాలతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే తవ్వకాలు నిలిపివేయాలని జాతీయస్థాయిలో ఉద్యమిస్తామన్నారు. కలుషిత నీటితో జీవనాధారం కోల్పోతున్న  బాధిత రైతులకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆమ్‌ఆద్మీ పార్టీ రాయలసీమ కన్వీనర్‌ సాహీద్‌హుసేన్, ఆపార్టీ పరిశీలకురాలు సుధ, కన్వీనర్‌ వరప్రసాద్, ప్రజాసంఘాల నాయకులు, బాధిత రైతులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు