పులివెందుల ఏపీ కార్ల్‌లో వ్యాక్సిన్ తయారీ యూనిట్

19 Jun, 2020 14:25 IST|Sakshi

సీఎం వైఎస్‌ జగన్ సమక్షంలో ఐజీవైతో అవగాహన ఒప్పందం

సాక్షి, అమరావతి: ప్రపంచస్థాయి వ్యాక్సిన్‌ తయారీ కేంద్రం దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడుగులు వేసింది. పులివెందుల ఏపీ కార్ల్‌లో వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఐజీవైతో అవగాహన ఒప్పందం కుదురింది. ఈ మేరకు ఏపీ కార్ల్‌ సీఈఓ డాక్టర్‌ ఎం.శ్రీనివాసరావు, ఐజీవై ఇమ్యునోలాజిక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రమోటర్‌ డాక్టర్‌ ఆదినారాయణరెడ్డి అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. (టూరిజం కంట్రోల్‌ రూమ్‌లను ప్రారంభించిన సీఎం‌ జగన్)‌

రాష్ట్ర విభజన తర్వాత పశువులకు అవసరమైన వ్యాక్సిన్‌ ఉత్పత్తి కేంద్రం లేకపోవడంతో  ఏపీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి కొన్నాళ్లుగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. పీపీపీ విధానంలో ఐజీవైతో పులివెందుల ఐజీ కార్ల్‌లో వ్యాక్సిన్ల ఉత్పత్తి కేంద్రం కోసం ఒప్పందం కుదురింది. 2021 నుంచి వ్యాక్సిన్ల తయారీని ప్రారంభించనున్నారు. (ఏపీని అగ్రస్థానంలో నిలిపారు: వైఎస్‌ విజయమ్మ)

పశువులకు కావాల్సిన అన్నిరకాల వ్యాక్సిన్లు తయారీ కానున్నాయి. గొర్రెలకు సహజంగా సోకే చిటెక రోగం, బొబ్బర్ల రోగం, పీపీఆర్, పశువుల్లో వచ్చే గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వ్యాధి, బ్రూసిల్లా మొదలగు వ్యాధులకు అవసరమైన వ్యాక్సిన్ల తయారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌కు ఐజీవై దాదాపు రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని సదుపాయాలను కల్పించనుంది. దీంతో 100 నిపుణులకు, సిబ్బందికి ఉపాధి  కలుగనుంది. మన రాష్ట్రాలు అవసరాలు తీర్చిన తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసే దిశగా  ఏపీ ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది.

మరిన్ని వార్తలు