మరోసారి వర్ల రామయ్య నిర్లక్ష్యపు వ్యాఖ్యలు

14 Jul, 2018 13:43 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మెన్ వర్ల రామయ్య మరోసారి నిర్లక్ష్య వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌ ఆర్టీసీపై అధ్యయనానికి ఆయన మూడు రోజుల పాటు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వర్ల మాట్లాడుతూ.. హత్య చేస్తే జైలుకు వెళ్తారని అందరికీ తెలసునని, కానీ ఎంత మంది ఊరుకుంటున్నారని, శిక్ష పడుతుందని తెలినసినా హత్యలకు పాల్పడుతున్నారంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. ఏపీలో ప్రైవేట్‌ బస్సుల కల్చర్‌ ఇప్పటిది కాదని, దానికి చంద్రబాబు అనడం సరికాదన్నారు. ప్రయాణికుల్లో మార్పు రావాలని, ప్రైవేటు బస్సుల్లో ప్రయానించొద్దు అనే ఉద్యమాన్ని ప్రజలే తీసుకు రావాలంటూ వ్యాఖ్యానించారు. బస్సు స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ టికెట్స్ అమ్మవద్దని రూల్ ఉందని, కానీ ఎవరు రూల్స్ పాటిస్తారంటూ మాట్లాడారు. 

గుజరాత్‌లో ఆర్టీసీ ప్రయాణాలు అద్భుతంగా అందుబాటులో ఉన్నాయని, అభివృద్ధి చూసి ఏపీలో ప్లాన్ చేయాలనే ఆలోచనలో బాబు ఉన్నారని అన్నారు. గుజరాత్‌లో ప్రత్యేక మార్గం ఉందని అందుకే అభివృద్ధిలో ముందుందని పేర్కొన్నారు. గుజరాత్ పర్యటన అనంతరం ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో బస్‌స్టాపుల నిర్మాణంపై సీఎంకు ప్లాన్ ఇస్తామని చెప్పారు. బస్టాండ్ కి వచ్చిన ప్రయాణికులకు షాపింగ్స్, సినిమాలు, హోటల్స్ అన్ని అక్కడే ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ నిర్మాణాల కోసం ప్రైవేటు వ్యక్తులు కాంట్రాక్ట్ కోసం ముందుకు రావాలని కోరారు.

మరిన్ని వార్తలు