జగన్‌కు ప్రజాదరణ ఓర్వలేకే దుష్ర్పచారం: వాసిరెడ్డి పద్మ

18 Jan, 2014 02:41 IST|Sakshi
జగన్‌కు ప్రజాదరణ ఓర్వలేకే దుష్ర్పచారం: వాసిరెడ్డి పద్మ

 వైఎస్సార్‌సీపీ నేత వాసిరెడ్డి పద్మ
సమైక్య రాష్ట్రం కోసం జగన్ చేస్తున్న కృషి కాంగ్రెస్, టీడీపీ నేతలకు కనిపించడం లేదా?
జగన్‌ను కాంగ్రెస్‌కు దగ్గర చేయూలనే ప్రయత్నాలు సాగనందుకే సబ్బం హరి విమర్శలు

 
 సాక్షి, హైదరాబాద్:
‘రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమైక్యవాదాన్ని కాంగ్రెస్ వేసే కుక్క బిస్కట్లకు వెంపర్లాడే ఎంపీలు శంకించడమేమిటి?  కాంగ్రెస్, టీడీపీ నేతలు పనిగట్టుకుని ఆయనపై ఎందుకు విషం చిమ్ముతున్నారు?’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నిలదీశారు. జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలే క సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబుమొదలు కాంగ్రెస్, టీడీపీకి చెందిన కోస్తా, రాయలసీమ ఎంపీలు, ఎమ్మెల్యేలు.. అందరూ ఒక స్క్రిప్ట్ ప్రకారం జగన్ సమైక్యవాది కాదంటూ దుష్ర్పచారం చేస్తున్నారని ఆమె విమర్శించారు. తాజాగా ఈ బృందంలోకి సబ్బంహరి కూడా చేరారన్నారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
 
 సమైక్య ఉద్యమం చేసిందెవరు?: ‘‘విభజనకు నిర్ణయం తీసుకున్న సోనియాను ఇప్పటివరకూ పల్లెత్తు మాట అనకుండా, అక్టోబర్ 3న కేంద్ర మంత్రివర్గం విభజన నిర్ణయం ఆమోదించినప్పుడు కూడా నోరు మూసుక్కూర్చున్న ఎంపీలు ఇప్పుడు తామేదో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టామంటూ కాలర్ ఎగరేస్తూ మాట్లాడుతున్నారు. కానీ జూలై 30న సీడబ్ల్యూసీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుంటోందని తెలిసి జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించారు.
 
  కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలెవరూ అప్పుడు రాజీనామాలు చేయలేదు. సమైక్యంగా ఉంచేందుకు కలిసి పోరాడుదామని జగన్ చేతులు జోడించి మరీ అందరికీ విజ్ఞప్తి చేశారు. బిల్లు రాకముందే సమైక్య తీర్మానం చేసి పంపుదామని కోరారు. అవేవీ మీ చెవికెక్కలేదా?’’ అని పద్మ ప్రశ్నించారు. ‘‘జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా ఒంటరిగానే విభజనకు వ్యతిరేకంగా దీక్ష చేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుంటూరులో దీక్ష చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక కూడా కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని తప్పుపడుతూ నెల రోజులలోపే రెండోసారి దీక్ష చేయడం ద్వారా జగన్ ఆరోగ్య సమస్యలు తెచ్చుకున్నారు. విభజన అన్యాయం అంటూ రాష్ట్రపతికి లేఖలు రాశారు. బిల్లు వచ్చాక దానిని వ్యతిరేకిస్తూ రాష్ట్రపతికి అఫిడవిట్లను అందజేశారు. మీకు ఇవన్నీ కనపడలేదా...మీ కళ్లు బైర్లు కమ్మాయా! ’’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.   
 
 ఎంపీ టికెట్ ఇవ్వనందుకే సబ్బం అక్కసు: విభజన ప్రక్రియ ఆరునెలలుగా సాగుతున్నా ఏమీ చేయలేని సబ్బం హరి ఇప్పుడు జగన్ సమైక్యవాదంపై విమర్శలు చేయడానికి కారణం ఆయనకు తమ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వక పోవడమేనని పద్మ చెప్పారు. లోక్‌సభలో జగన్, తాను పక్కపక్కన కూర్చున్నామని చెప్పడం ఒక్కటే హరి చెప్పిన నిజమన్నారు. ఆయన కాంగ్రెస్, సోనియా ఏజెంట్‌గానే కొంతకాలం జగన్‌తో కలిసి ఉన్నారని, జగన్‌కు నచ్చజెప్పి కాంగ్రెస్‌కు దగ్గర చేయాలన్న ప్రయత్నాలకు లొంగలేదు కనుకనే ఇప్పుడు విమర్శలకు దిగారని స్పష్టం చేశారు. ‘వైఎస్సార్‌సీపీలో చేరాలనుకుంటే ఎంపీ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రమ్మని జగన్ మీకు చెప్పిన మాట నిజమా... కాదా’ చెప్పండి అని సబ్బం హరిని పద్మ నిలదీశారు. యూపీఏకు మద్దతిస్తానని జగన్ ఎప్పుడూ చెప్పలేదన్నారు.

మరిన్ని వార్తలు