బాబువి బజారు రాజకీయాలు..

12 Oct, 2014 01:17 IST|Sakshi
బాబువి బజారు రాజకీయాలు..

ఏపీ ముఖ్యమంత్రిపై వాసిరెడ్డి పద్మ ఫైర్
అనుమతులు ఇవ్వకుండా పరిశ్రమ పెట్టలేదంటే ఎలా?
ఆ కారణంతో లీజు రద్దు చేయటం దుర్మార్గం కాక మరేంటి?

సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీ ప్రకారం వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం చేతకాని సీఎం చంద్రబాబునాయుడు ప్రధాన ప్రతిపక్షం ఎక్కడికక్కడ తమను ప్రశ్నిస్తోందన్న భయంతో చివరకు బజారు రాజకీయాలు మొదలుపెట్టారని వైఎస్సార్ సీపీ తీవ్రస్థాయిలో మండిపడింది. శనివారం హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కార్యాలయం ఎదుట రైతుల పేరిట దిగజారుడు రాజకీయాలు చేశారని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ... ‘‘ఇక్కడికెందుకు వచ్చారని వారిని అడిగితే గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీసుకొచ్చారని వారు చెప్పారు. యరపతినేని వాహనం కూడా అక్కడే ఉంది.  

సర్వసతి భూములు కొనుగోలు చేసినవే తప్ప బాబు మందీ మార్బలంలా విజయవాడ చుట్టుపక్కల దందాలు చేసి రైతులను బెదిరిస్తూ తీసుకున్నవి కావు. భూములు ఇవ్వకుంటే బలవంతంగానైనా తీసుకుని పరిహారంతోనే సరిపెడతామంటూ ఆయన రైతులను బెదిరించే విధానాన్ని చూసి ఏపీ ప్రజలంతా నివ్వెరపోతున్నారు’’ అని విమర్శించారు. చంద్రబాబు నాయుడి రాజగురువుకు హైదరాబాద్‌లో ఉన్న 2,500 ఎకరాల్లో ఆ భూములను పది వేలకో, పాతిక వేలకో అమ్మకున్న రైతులు నాగళ్లతో దున్నించాలన్నారు.

వాసిరెడ్డి పద్మ పేర్కొన్న మరికొన్ని అంశాలు..
చంద్రబాబు సతీమణీ భవనేశ్వరి కూడా రూ.వందల కోట్ల సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు. ఆయన కొడుకు పేరు మీద ఫాంహౌస్‌లనో. మరొకటనో.. వందల ఎకరా ల భూములు పోగుపడి ఉన్నాయి. హెరిటేజ్ సంస్థకే మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో వం దలాది ప్రదేశాల్లో గ్రామాలు,  మహా నగరాల వరకు భూములున్నాయి.  అమ్మిన వ్యక్తులు వాటిలో సేద్యం చేసుకోవచ్చా?

ఏపీ ప్రభుత్వం నుంచి కనీసంగా సర్వసతి పవర్ సిమెంట్ ప్లాంట్‌కు అవసరమైన నీటి సరఫరా అనుమతులు కూడా మంజూరు చేయలేదంటే, ఇంతకు మించిన రాజకీయ కక్ష సాధింపు ఉంటుందా?రాష్ట్ర ప్రభుత్వం కనీసం పొల్యూషన్ కంట్రోలు బోర్డు అనుమతులు కూడా ఇవ్వలేదంటే అంతకుమించి కక్ష సాధింపు ఉంటుందా? అనుమతులు ఇవ్వకుండా ఆపి పరిశ్రమ పెట్టలేదని లీజు రద్దు చేశారంటే ఇంతకు మించిన దుర్మార్గం ఉంటుందా?ప్రజలకు మంచి చేసి పేరు తెచ్చుకోవాలన్న చరిత్ర బాబుకు ఏ నాడు లేదు.

ఏదో కొద్ది మందిని రెచ్చగొట్టి ఇళ్లమీదకు పంపే కల్చర్ ప్రారంభించిన ఆయనకు అదే పద్ధతిలో సమాధానమివ్వాలని మేం భావించడం లేదు. ఎన్టీఆర్ మీదే చెప్పులు వేయించిన మనిషి మా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మీద ఈ మాత్రం పైత్యం ప్రదర్శించకుండా ఉంటాడని ఎవరు అనుకోగలరు? సీఎంగా ఉండి పిరికిపందలా పది మంది జనాన్ని ప్రతిపక్ష నాయకుడి ఇంటిమీద, కార్యాలయం మీద ఎగదొస్తున్న బాబుకు ప్రజలే బుద్ధిచెప్తారు.

మరిన్ని వార్తలు