సీఎం సిగ్గుతో తలదించుకోవాలి

19 Jan, 2018 02:48 IST|Sakshi

కుప్పం ఘటనపై ధ్వజమెత్తిన వాసిరెడ్డి పద్మ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే మహిళలకు రక్షణ లేకపోతే.. ఇక రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఏంటని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆందోళన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం గుంజార్లపల్లి గ్రామంలో ఒక మహిళను అమానుషంగా వివస్త్రను చేసి టీడీపీ నేతల అండతో దాడి చేసిన ఘటనపై చంద్రబాబు, ఆయన కుటుంబీకులు రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఆ ఘటనను టీడీపీ నేతలు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టి పైశాచికానందాన్ని పొందుతున్నారని, దీనిపై ముఖ్యమంత్రితో పాటు అందరూ సిగ్గుతో తలదించుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం  ఆమె విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన ఇద్దరు దంపతులను పక్కన ఉన్న మహిళ దుర్భాషలాడడం, తర్వాత వారిపై దాడి చేయడం వెనుక టీడీపీ ప్రోద్బలం ఉందని స్పష్టంగా తెలుస్తోందన్నారు. మహిళను వివస్త్రను చేసి, రాళ్లతో కొట్టి, నోటితో కొరికి దారుణంగా దాడి చేశారని మండిపడ్డారు. 

మరిన్ని వార్తలు