వీసీ సారూ.. స్నాతకోత్సవం మరిచారు

9 Feb, 2015 08:44 IST|Sakshi

తిరుపతి తుడా: ఎస్వీ యూనివర్సిటీలో అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపంతో వేలాది మంది విద్యార్థుల భవిత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏడాదికోసారి నిర్వహిం చాల్సిన స్నాతకోత్సవంపై నిర్లక్ష్య నీడలు అలుముకున్నాయి. ఏళ్ల తరబడి నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో విద్యార్థులకు సకాలంలో పట్టాలు అందడం లేదు. ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాల నిమిత్తం అత్యవసరంగా వేలాది రూపాయలు దళారులకు ఇచ్చుకుని ఇన్ అడ్వాన్స్ కింద పొందాల్సిన దుస్థితి నెలకుంది.

విద్యార్థుల ఎదురుచూపులు..
 2011 వార్షిక ఏడాది నుంచి 2015 వరకు విద్య అభ్యసించిన విద్యార్థులు స్నాతకోత్సవం కోసం ఎదురు చూస్తున్నారు. 2010 సంవత్సర విద్యార్థులకు అప్పటి వీసీ ప్రభాకరరావు 2011లో స్నాతకోత్సవానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ కాన్వొకేషన్‌నిర్వహించే సమాయానికి ప్రసుత్త వీసీ రాజేంద్ర బాధ్యతలు తీసుకున్నారు. 2012 జూన్ 30న 53వ స్నాతకోత్సవాన్ని నిర్వహించి తన ఖాతాలో వేసుకున్నారు. వీసీగా బాధ్యతలు తీసుకుని దాదాపు మూడు ఏళ్లు కావస్తున్నా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేకపోయారు. చిత్తూరుతో పాటు నెల్లూరు, వైఎస్‌ఆర్ జిల్లాల కళాశాలలు ఎస్వీయూ పరిధికి వస్తాయి.

దాదాపుగా 200 డిగ్రీ, పీజీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, బీ ఫార్మసీ కళాశాలలు, 130 దూరవిద్య కేం ద్రా లు ఉన్నాయి. ఈ కళాశాలల నుంచి ఏడాదికి సుమారుగా 40 వేల మంది విద్యార్థులు కోర్సులు పూర్తి చేసుకుంటున్నారు. యూజీసీ నిబంధనల మేరకు ఏటా స్నాతకోత్సవం నిర్వహించి కోర్సు పూర్తి చేసిన ఆరు నెలల్లో పట్టాలు ఇవ్వాల్సి ఉంది. ఈ లెక్క ప్రకారం వర్సిటీ 57వ నిర్వహించాల్సి ఉంది. వీసీ రాజేంద్ర బాధ్యతలు చేపట్టాక ఒక్క స్నాతకోత్సవం నిర్వహించకపోవడంతో 53కే పరిమితమయ్యాయి. 2014-15 వార్షిక ఏడాది మరో మూడు నెలల్లో పూర్తి కానుంది. దీంతో పట్టా లు తీసుకోవాల్సిన విద్యార్థుల సంఖ్య రెండు కోట్లకుపైగా పెరగనుంది.

బ్లాక్ మార్కెట్‌లో ఇన్ అడ్వాన్స్ పట్టాలు..
డీఎస్సీ, ఇతర ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా, ఉన్నత చదువులకు వెళ్లాలన్నా తప్పనిసరి డిగ్రీ, పీజీ పట్టా ఇవ్వాల్సి ఉంటుంది. వర్సిటీలో సరైన సమయంలో స్నాతకోత్సవం నిర్వహించకపోవడంతో విద్యార్థులు దళారులను ఆశ్రయిస్తున్నారు. అత్యవసరంగా పట్టా లు పొందేందుకు వర్సిటీలో ఇన్ అడ్వాన్స్ వెలుసుబాటు ఉంది. ఇందుకు అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా దరఖాస్తు చేసుకుంటే రూ. 245తో పట్టా పొందవచ్చు. ఇన్ అడ్వాన్స్ ద్వారా పట్టాలు పొందాలంటే వర్సిటీకి అదనంగా మరో రూ.1800 వరకు చెల్లించాలి. అయినా పట్టా లు సమయానికి అందకపోవడంతో విద్యార్థులు వర్సిటీలో దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది.

ఇలాంటి వారి కోసం వర్సిటీలో బ్లాక్ మార్కెట్ నడుస్తోంది. అధికారులతో సత్సంబంధాలు నడుపుతూ విద్యార్థుల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. రూ.2000 నుంచి రూ.3000 వరకు ముడుపులు ఇచ్చుకుంటే అనుక్ను సమయానికి పట్టాలు చేతికొస్తాయి. ఇలా 54 స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకున్న 30 వేల మందిలో 20 వేల మంది అదనంగా డబ్బులు చెల్లించి పట్టాలు పొందారని సమాచారం. 2012-14 లోపు మరో 20 వేల మంది వరకు ఇన్ అడ్వాన్స్ ద్వారా అధిక మెత్తం చెల్లించి పట్టా లు తీసుకున్నారు.

మరిన్ని వార్తలు