సామాన్యులకు అందుబాటులో లేని ధరలు
వర్షం ప్రభావం అంటున్న వ్యాపారులు
కూరగాయల ధరలు చుక్కలనంటడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు దిక్కుతోచడం లేదు. ఏది కొనాలన్నా నిప్పులా ఉంది. ధరలు చూసి కొనేందుకు జనం వెనకడుగు వేస్తున్నారు. తప్పనిసరి పరిస్ధితుల్లో తక్కువ పరిణామంలో కొనుగోలు చేసుకుంటున్నారు.
సాక్షి, తిరుపతి: కూరగాయల ధరలు కొండెక్కడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై ఆర్థికభారం పెరిగిపోయింది. సాధారణంగా ఆగస్టు నెలలో కూరగాయలు అందుబాటులోకి వస్తాయి. అయితే ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాలకు కూరగాయల తోటలు పాడవడంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ఏ కూరగాయ రేటు చూసినా కిలో రూ.40కిపైగానే ఉంది. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూరగాయలు కొనేందుకు జంకుతున్నారు. వ్యాపారులు చెప్పే ధరలకు సామాన్య, మధ్య తరగతి ప్రజలు కిందకు మీదకు చూడాల్సి వస్తుంది. కూరగాయలు లేకుండా పూట గడవని పరిస్థితిలో వాటి ధరలు ఆకాశాన్నంటడంతో.. కిలో కొనాలనుకున్న వారు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు.
కిలో రూ.40 పైనే..
ప్రస్తుతం మార్కెట్లో కేజీ ఎర్రగడ్డ రూ.25, కాకరకాయ, బీన్స్, చిక్కుడు కేజీ రూ.60, క్యారెట్ కేజీ రూ.80, వంకాయ, బెండకాయ కేజీ రూ.50 పలుకుతున్నాయి. వర్షాలకు కూరగాయలు దెబ్బతినడంతో రేట్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. భవిష్యత్లో మరింత రేట్లు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇది చదవండి : రానున్న రోజుల్లో ఉల్లి ‘ఘాటు’