అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి

13 Nov, 2019 10:09 IST|Sakshi

సాక్షి, విజయవాడ: విపక్షాలు అన్న వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే తమ లక్ష్యమని దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా 36,39వ డివిజన్‌లో కోటి యాభై లక్షలతో ఏర్పాటుకానున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. 39వ డివిజన్‌లో రూ.30 లక్షలతో వర్షపు నీరు డైవర్షన్‌ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలోని 36వ డివిజన్‌ గత ఐదేళ్లలో రోడ్ల అభివృద్ధికి నోచుకోలేదని పేర్కొన్నారు. 40వ డివిజన్‌లో ఉన్న మసీదు ముందు ఉన్న రోడ్డును సైతం పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే ఇంటి చుట్టూ కూడా రోడ్డు వేసుకోలేని దుస్థితి ఉండేదని విమర్శించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి అన్న రీతిలో సీఎం జగన్‌ పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు