రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే.. దేశాభివృద్ధి

4 Dec, 2018 20:10 IST|Sakshi

సాక్షి, విజయవాడ: కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కలిసి పనిచేయాలని, రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. గన్నవరం విమానశ్రయంలో 611 కోట్ల రూపాయలతో నిర్మించే ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌కు భూమి పూజ కార్యక్రంమంలో కేం‍ద్ర పౌర విమానాయ శాఖ మంత్రి సురేష్‌ ప్రభు, సహాయ మంత్రి జయంత్‌ సిన్హాతో కలిసి పాల్గొన్న ఆయన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 

రవాణా రాకపోకాలు పెరగటం అభివృద్ధికి సూచిక అని పేర్కొన్నారు. గన్నవరం విమానశ్రయంలో సింగపూర్‌కే కాదు ప్రపంచ దేశాలకు సైతం విమాన సర్వీసులు రావాలని ఆకాంక్షించారు. అందమైన కృష్ణా నది, కూచిపూడి నాట్యం, జాస్మిన్‌ ప్లవర్‌ ఆకారాలలో న్యూ టెర్మినల్‌ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. రోడ్డు, రైలు, ఎయిర్‌, వాటర్‌ కనెక్టివిటీకి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తిరుపతి, రాజమండ్రి, కడప ఎయిర్‌ పోర్టుల అభివృద్ది కూడా జరగాల్సి ఉందన్నారు. 

100 కొత్త విమానాశ్రయాలు
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్దికి అవసరమైన మౌళిక సౌకర్యాలు సమకూర్చుతున్నామని కేం‍ద్ర పౌర విమానాయ శాఖ మంత్రి సురేష్‌ ప్రభు పేర్కొన్నారు. 65 బిలియన్‌ డాలర్స్‌ వెచ్చించి100 కొత్త విమానాశ్రాయాలు నెలకొల్పామని తెలిపారు. టెర్మినల్‌ పూర్తయిన తరువాత ఏపీకి ఐకాన్‌గా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందన్నారు. ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌తో పోటీగా ప్రయాణికులకు సౌకర్యాలు సమకూర్చుతున్నామన్నారు. వచ్చే రెండు రోజుల్లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపైన కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. 
 

మరిన్ని వార్తలు