సాక్షి, తిరుపతి : త్రిపుర రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తిరుపతికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఉసురుపాటి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు తిరుపతిలోని ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్వర్లు స్వస్థలం కార్వేటినగరం మండలం సుద్ధగుంట గ్రామం. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం తిరుపతిలోని నెహ్రు మున్సిపల్ హైస్కూల్లో సాగింది. శ్రీవెంకటేశ్వర జూనియ ర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివారు.
అనంతరం ఎస్వీ వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్, ఐఏఆర్ఐ (న్యూఢిల్లీ)లో ఎంఎస్సీ, పీహెచ్డీ పూర్తి చేశారు.1986లో ఐఏఎస్గా సెలెక్టయ్యారు. వెంకటేశ్వర్లు ఉమ్మడి రాష్ట్రంలో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కమిషనర్ టూ సెక్రటరీ, వ్యవసాయశాఖలో జాయింట్ సెక్రటరీ, విద్యాశాఖ జాయింట్ సెక్రటరీగా పనిచేసి కేంద్ర సర్వీసులకు బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం త్రిపుర రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన జైపాల్ రెడ్డి వద్ద పీఎస్గా బాధ్యతలు నిర్వహించారు.