రాజకీయ కార్యాలయాల వేదిక మినీబైపాస్‌

30 Mar, 2019 10:00 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి కార్యాలయం, టీడీపీ ఎంపీ అభ్యర్థి బీఎంఆర్‌ కార్యాలయం,  మినీబైపాస్‌ రోడ్డులోని బీజేపీ కార్యాలయం, మినీబైపాస్‌ రోడ్డులోని జనసేన కార్యాలయం 

పలు పార్టీల కార్యాలయాలు అక్కడ

ఎన్నికల నేపథ్యంలో కోలాహలం

సాక్షి, నెల్లూరు(అర్బన్‌): ప్రశాంతంగా ఉండే మినీబైపాస్‌ రోడ్డు రాజకీయ కార్యాలయాలకు వేదికైంది. మినీబైపాస్‌ రోడ్డులోనే టీడీపీ, బీజేపీ, జనసేన కార్యాలయాలు ఉన్నాయి. మరో 10 అడుగులు ముందుకేస్తే సీపీఎం కార్యాలయం ఉంది. అలాగే మినీబైపాస్‌ రోడ్డుకు కూతవేటు దూరంలోనే మాగుంట లేఅవుట్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయా కార్యాలయాల వద్ద  రాజకీయ సందడి నెలకొంది. నిత్యం వందలాది మంది కార్యకర్తలు కార్యాలయాల బాట పట్టారు. ఎన్నికల సామగ్రి నిర్వహణ, ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ ప్రత్యర్థుల గురించి చర్చలు, ప్రచార వ్యూహాలు ఈ కార్యాలయాల నుంచే జరుగుతున్నాయి.

పలువురు ప్రజాప్రతినిధులు, మాజీలు, పోటీ చేసే అభ్యర్థులు, వారి శ్రేయోభిలాషులతో ఆయా కార్యాలయాల వద్ద సందడిగా ఉంది. ఆ కార్యాలయాల పక్కనే ఉండే టీ దుకాణాలు, కేఫ్‌లు, జ్యూస్‌ షాపులు నిత్యం వచ్చిపోయే కార్యకర్తలతో కిటకిటలాడుతున్నాయి. ఓటు రాజకీయాలతో కార్యాలయాలు కళకళలాడుతుండగా, మరోవైపు ఎన్నికల పుణ్యమా అని తమ వ్యాపారం బాగా జరుగుతుందని పార్టీ కార్యాలయాల సమీపంలోని దుకాణాల యజమానులు సంబరపడుతున్నారు. 


 

మరిన్ని వార్తలు