కామాంధుడికి బలై మృత్యువు ఒడిలోకి..

22 Oct, 2016 21:43 IST|Sakshi
* లైంగిక దాడి బాధితురాలి ఆత్మహత్యాయత్నం
తొమ్మిది రోజులపాటు మృత్యువుతో పోరాటం
చికిత్సపొందుతూ మృతి 
 
రేవేంద్రపాడు (దుగ్గిరాల): లైంగిక దాడికి గురై ఆత్మహత్యాయత్నం చేసిన బాలిక మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని రేవేంద్రపాడుకు చెందిన షేక్‌ బుజ్జి భర్త రెండేళ్ల క్రితం మృతి చెందడంతో కూలిపనులు చేస్తూ జీవిస్తోంది. ఆమె కుమార్తె (17) తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ కూలి పనులకు వెళ్తోంది.
 
వీరి ఇంటి ఎదురుగా నివాసం ఉంటున్న షేక్‌ అమీర్‌బాషా కన్ను బాలికపై పడింది. ఈ క్రమంలో తల్లి ఈ నెల 12వ తేదీ రొట్టెల పండుగను పురస్కరించుకుని నెల్లూరు జిల్లాకు వెళ్ళింది. అదేరోజు రాత్రి ఇంట్లో బాలిక, ఆమె తమ్ముడు, మేనమామ రాత్రి 12 గంటల సమయం వరకు సినిమా చూశారు. తర్వాత అమ్మమ్మ ఇంట్లో నిద్రించేందుకు బయలుదేరారు. ఒంటరిగా ఉన్న బాలికను అమీర్‌బాషా గొంతు మూసి బలవంతంగా  సమీపంలో ఊర్దు పాఠశాలలోకి తీసుకెళ్ళి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక మరుసటిరోజు అమ్మమ్మవెంట పొలానికి వెళ్ళిన సమయంలో పురుగుల మందు తాగింది. దీనిని గమనించిన స్థానికులు మంగళగిరిలోని ఓ ప్రై వేటు వైద్యశాలకు తరలించారు. తొమ్మిది రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బాలిక శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందింది. పోస్ట్‌మార్టం ముగిసిన తరువాత   బాలిక మతదేహాన్ని ఖననం చేశారు. 
మరిన్ని వార్తలు