కుళ్లిన మాంసం.. చేదెక్కిన స్వీట్లు

21 Nov, 2018 13:28 IST|Sakshi
స్వీట్లు తయారు చేసే ప్రాంతాలను పరిశీలిస్తున్న విజిలెన్సు ఎస్పీ శోభామంజరి స్వాధీనం చేసుకున్న మురుగుపోయిన చికెన్‌

స్వీట్ల నుంచి నాన్‌వెజ్, వెజ్‌ ఐటమ్స్‌ వరకు అన్నీ కల్తీమయం

రెస్టారెంట్‌లలో మురిగిపోయిన చికెన్‌తోనే వంట

విజిలెన్స్‌ అధికారుల     తనిఖీల్లో వెల్లడి

గుంటూరు(నగరంపాలెం): నగరంలో చిరు తిండ్లు నుంచి ఆహార పదార్థాలు, నాజ్‌ వెజ్‌ ఐటమ్స్‌ వరకు అన్నీ కల్తీమయమయ్యాయి. అత్యాశతో వ్యాపారులు నాణ్యత లేని, కల్తీ పదార్థాలు అమ్ముతున్నారు. వాసన రాకుండా ఉండేందుకు నిషేధిత కెమికల్స్‌ వినియోగిస్తున్నారు. నగరంలో తినుబండరాలు తయారు చేసే పలు దుకాణాలపై మంగళవారం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ శోభామంజరి ఆధ్వర్యంలోæ అధికారులు దాడులు చేశారు. కొరిటెపాడులోని సిరి, సకల స్వీట్‌ షాపులు, తయారీ చేసే ప్రాంతాలను పరిశీలించారు. అక్కడ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతోపాటు స్వీట్లు తయారీకి నాణ్యత లేని పదార్థాలు వినియోగిస్తున్నట్లు గమనించారు. దీంతో స్వీట్లు పరీక్షల నిమిత్తం శాంపిల్స్‌ తీశారు. లాలాపేట తూనుగుంట్ల వారి వీధిలో రహదారిపై తినుబండారాలు విక్రయిస్తున్న దుకాణాల్లో తనిఖీ చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా తిను బండారాలు విక్రయిస్తున్నట్లు గమనించి నోటీసులిచ్చారు. లాలాపేట హోల్‌సేల్‌ దుకాణాల్లో చిన్నారులు తినే తినుబండరాలు ప్యాకెట్లను పరిశీలించి పరీక్షల నిమిత్తం శాంపిల్స్‌ సేకరించారు.

కుళ్లిన మాంసం స్వాధీనం
బస్టాండ్‌ ఎదుట ఐశ్వర్య బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లోని కిచెన్‌ను అధికారులు పరిశీలించారు. అక్కడ దుర్వాసన స్థితిలో మురుగుపోయిన చికెన్‌ నిల్వలను ఫ్రిజ్‌లో గుర్తించారు. గతంలో మిగిలిపోయిన వండిన చికెన్‌ ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. దుర్వాసన, రంగు తెలియకుండా ఉండటానికి నిషేధిత కెమికల్స్‌ పదార్థాలు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. మాంసం ధ్వంసం చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్‌ ఎస్పీ శోభా మంజరి మాట్లాడుతూ కల్తీ, పరిశుభ్రతలేని ఆహార పదార్థాలు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో విజిలెన్సు డీఎస్పీ సుబ్బారెడ్డి, సీఐ అంటోనీ రాజు, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏ శ్రీనివాసులు, కానిస్టేబుల్స్‌ డీ శ్రీను, హరికృష్ణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు