పెట్రోల్‌ బంకులపై విజి‘లెన్స్‌’

23 Jan, 2019 14:09 IST|Sakshi
పెట్రోల్‌ బంకులో తనిఖీ నిర్వహిస్తున్న అధికారులు

కల్తీ, కొలతల్లో తేడాపై తనిఖీలు  

కర్నూలు: పెట్రోల్‌ బంకుల్లో జరుగుతున్న కల్తీ, కొలతల్లో తేడాలపై విజిలెన్స్‌ అధికారులు దృష్టి సారించారు. పెట్రోల్, డీజిల్‌లో కిరోసిన్‌ కలిపి విక్రయాలు జరుపుతున్నారని, కొలతల్లో కూడా తేడాలు వస్తున్నాయని వినియోగదారుల నుంచి భారీ ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ దేవదానం, సీఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని పెట్రోల్‌ బంకుల్లో తనిఖీలు నిర్వహించారు. తూనికలు, కొలతల శాఖ అధికారులతో కలసి నారాయణస్వామి పెట్రోల్‌ బంకు, ఆల్ఫా పెట్రోల్‌ బంకుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

పెట్రోల్, డీజిల్‌లో ప్యూరిటీ, డెన్సిటీ మెజర్‌ మెంట్స్‌  పరిశీలించారు. సీఐ లక్ష్మయ్య నేతృత్వంలో మైనింగ్‌ శాఖ అధికారులతో కలిసి మరో బృందం అక్రమ రవాణాపై తనిఖీలు నిర్వహించారు. లైమ్‌ స్టోన్, నాపరాళ్లు, గ్రానైట్, ఇటుకలు, ఐరన్, వరిధాన్యం తదితర వాటిని అనుమతి పత్రాలు లేకుండా ఓవర్‌లోడ్‌తో తరలిస్తుండగా తనిఖీ చేసి  18 వాహనాలను సీజ్‌ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం రవాణా శాఖ అధికారులకు అప్పగించారు. 17 వాహనాల నుంచి రూ.2,96,000 అపరాధ రుసుం వసూలు చేయాలని వ్యవసాయ, మైనింగ్‌ శాఖ అధికారులకు నివేదించారు. 

మరిన్ని వార్తలు