-

రైస్‌మిల్లులపై విజిలెన్స్ దాడులు

5 Nov, 2013 06:33 IST|Sakshi

 నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: నగరంలోని పలు రైస్‌మిల్లులపై పౌరసరఫరాలశాఖ, విజిలెన్స్ అధికారులు, డిప్యూటీ తహశీల్దార్లు సోమవారం దాడులు నిర్వహించారు. ‘ఎల్లలు దాటుతున్న మన బియ్యం’ శీర్షికన సోమవారం సాక్షిలో ప్రచురితమైన వార్తకు జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం స్పందించారు. జిల్లావ్యాప్తంగా రైస్‌మిల్లులపై దాడులకు ఆదేశాలు జారీచేశారు. స్టోన్‌హౌస్‌పేటలోని లక్ష్మీప్రసన్న, కో ఆపరేటివ్ సొసైటీ మిల్లులపై అధికారులు దాడులు చేశారు. దీంతోపాటు శ్రీలక్ష్మీపద్మావతీ రైస్‌మిల్లులో కూడా తనిఖీలు నిర్వహించి బియ్యం శాంపిళ్లు సేకరించారు. నివేదికలను జేసీకి అందజేస్తామని అధికారులు తెలిపారు. జేసీ ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ శాంపిళ్లను పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 
 పెట్రోలు, కిరోసిన్ బంకులపై కూడా దాడులు
 జిల్లాలో ఒక పెట్రోల్, 11 కిరోసిన్ హోల్‌సేల్ బంకులతోపాటు ఆరు ఎల్‌పీజీ గ్యాస్ ఏజెన్సీలపై దాడులు నిర్వహించామని జేసీ తెలిపారు. అక్రమాలకు పాల్పడిన గ్యాస్ ఏజెన్సీలకు రూ.1.55 లక్షలు, ఆయిల్ ట్రేడర్లకు రూ.60 వేలు జరిమానా విధించామని చెప్పారు. కోవూరు కిరోసిన్ బంకు (జ్యోతి ఏజెన్సీ) లెసైన్సు రద్దుచేశామన్నారు. మిల్లులకు రూ.46,342 జరిమానా విధించినట్లు తెలిపారు. దాడుల్లో విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ సత్యనారాయణ, కావలి ఏఎస్‌వో శ్రీహరి, సీఎస్ డీటీలు లాజరస్, కాయల సతీష్‌కుమార్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు