ఏపీఎఫ్డీసీ చైర్మన్ టిఎస్ విజయ్ చందర్
సాక్షి, విజయవాడ: ప్రముఖ నటుడు, సాహితీవేత్త గొల్లపూడి మారుతీరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ(ఏపీఎఫ్డీసీ) చైర్మన్ టిఎస్ విజయ్ చందర్ సంతాపం తెలిపారు. తెలుగురాష్ట్రాల్లో ఆయన లేని లోటు తీర్చలేనిది అని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినీ, సాహిత్య, నాటక రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న గొల్లపూడి గొప్ప వ్యక్తిత్వం గల మనిషని ఆయనను కొనియాడారు. విజయనరంలో జన్మించి, విశాఖపట్నంలో వృత్తిని ప్రారంభించి కళామతల్లి సేవలో పునీతులైన గొల్లపూడి బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొన్నారు. ఆయన మొదటిసారిగా స్క్రీన్ప్లే అందించిన ‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రంతో తొలి నంది పురస్కారాన్ని గెలుచుకున్నారని వెల్లడించారు. తన సినీ జీవితంలో ఆరు నంది పురస్కారాలు అందుకున్నారన్నారు. దాదాపు 80 చిత్రాలకు రచయితగా, 290 చిత్రాలకు నటుడిగా గొల్లపూడి సాగించిన ప్రస్థానం స్ఫూర్తిదాయకమని విజయ్ చందర్ తెలిపారు.