రైల్వే బోర్డు చైర్మన్‌తో భేటీ అయిన విజయసాయిరెడ్డి

26 Nov, 2019 20:00 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ : రైల్వే బోర్డు చైర్మన్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌తో ఎంపీ విజయసాయి రెడ్డి మంగళవారం రైల్‌భవన్‌లో భేటీ అయ్యారు.  ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వేలో వాల్తేరు డివిజన్‌ను యధావిధిగా కొనసాగించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత నెల 30న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖ గురించి విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. కాగా వాల్తేరు డివిజన్‌ అంశంపై వినోద్‌కుమార్‌ యాదవ్‌ సానుకూలంగా స్పందించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైళ్ళు, రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం గతంలో చేసిన విజ్ఞప్తుల గురించి కూడా విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైళ్ళను ప్రవేశపెట్టే అంశం ప్రస్తుతం బోర్డు పరిశీనలో ఉన్నట్లు యాదవ్‌ తెలిపారు.

దేశంలోని అత్యధిక ఆదాయం కలిగిన రైల్వే డివిజన్లలో వాల్తేరు డివిజన్‌ అయిదో స్థానంలో ఉంది. 125 ఏళ్ళ చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్‌ను రద్దు చేసి దానిని విజయవాడ డివిజన్‌ కిందకు తీసుకురావాలన్న ప్రతిపాదన ఆర్ధిక భారంతో కూడుకున్నదని రాష్ట్ర ప్రజల మనోభావాలకు ఏ విధంగా విరుద్దమో విజయసాయి రెడ్డి బోర్డు చైర్మన్‌కు వివరించారు. రైల్వే చరిత్రలోనే ఎక్కడా ఇలా డివిజన్‌ను రద్దు చేసిన దృష్టాంతాలు లేవని తెలిపారు. దీనిపై యాదవ్‌ స్పందిస్తూ వాల్తేరు డివిజన్‌ కొనసాగింపుపై బోర్డు సానుకూలంగా వ్యవహరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టాల్సిన రైళ్ళ గురించి విజయసాయి రెడ్డి బోర్డు చైర్మన్‌కు వివరించారు. 

  • డోన్‌, నంద్యాల మీదుగా కర్నూలు - విజయవాడ మధ్య రాత్రి వేళ కొత్త రైలును ప్రవేశపెట్టాలని కోరారు. కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల ప్రజలకు ఈ రైలు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. 
  • తిరుపతి-సికింద్రాబాద్‌ మధ్య కొత్తగా తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రవేశపెట్టాలని, మచిలీపట్నం-యశ్వంత్‌పూర్‌ మధ్య ప్రస్తుతం వారానికి మూడు రోజులు నడుస్తున్న కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 7 గంటలకు చేరేలా ప్రతి రోజు నడపాలని తెలిపారు.
  • తిరుపతి-సాయి నగర్‌ షిరిడీ వయా గూడూరు, నెల్లూరు, ఒంగోలు మధ్య కొత్త రైలును ప్రవేశపెట్టాలని, తిరుపతి-వారణాసి మధ్య రైలు సర్వీసును ప్రవేశపెట్టాలని కోరారు.
  • ధర్మవరం-విజయవాడ మధ్య నడుస్తున్న రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించి ఉదయం 7 గంటలకల్లా విజయవాడ చేరేలా మార్చాలని, అలాగే విజయవాడ - బెంగుళూరు మధ్య ఒంగోలు, నెల్లూరు మీదుగా రైలును ప్రవేశపెట్టాలని పేర్కొన్నారు.
  • హైదరాబాద్‌-తిరువనంతపురం మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళ ప్రయాణ వేగాన్ని పెంచాలని కూడా విజయసాయి రెడ్డి బోర్డు చైర్మన్‌ను కోరారు.
మరిన్ని వార్తలు