‘జాతీయ రైతు కమిషన్‌ ఏర్పాటు చేయాలి’

6 Dec, 2019 17:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో రైతుల ప్రయోజనాలు, సంక్షేమం కోసం జాతీయ రైతు కమిషన్‌ ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఇందుకోసం రాజ్యంగాన్ని సవరించాలని ప్రతిపాదిస్తూ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రైవేటు మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టారు. రైతు ప్రతినిధులతో ఏర్పాటు చేసే కమిషన్‌ రైతాంగం సంక్షేమం, సంరక్షణ కోసం చేసే సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేసేలా పర్యవేక్షించే అధికారం కూడా ఆ కమిషన్‌కే ఉంటుందన్నారు. దీంతో పాటు ప్రాక్టీసు చేసే న్యాయవాదుల సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం తగిన పథకాలకు రూపకల్పన చేయడంతోపాటు.. న్యాయవాదుల సామాజిక భద్రత ఫండ్‌ను నెలకొల్పేందుకు వీలు కల్పించేలా 1961 నాటి అడ్వకేట్స్‌ చట్టాన్ని సవరించాలని కోరుతూ రెండో బిల్లును ప్రవేశపెట్టారు. 

అలాగే మహిళల నుంచి గొలుసులు, అభరణాలు, ఇతర విలువైన వస్తువులను దొంగిలించే చర్యను విస్పష్టమైన నేరంగా నిర్వచిస్తూ.. ఇటువంటి నేరాలకు పాల్పడే వారికి 5 నుంచి 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధించేలా 1960 నాటి భారతీయ శిక్షాస్మృతిని సవరించాలని ప్రతిపాదిస్తూ మూడో బిల్లును ప్రవేశపెట్టారు. తద్వారా మహిళల నుంచి చైన్లు దొంగిలించే నేరాలను సమర్థవంతంగా ఆరికట్టే అవకాశం ఉంటుందని చెప్పారు.

మరిన్ని వార్తలు