‘కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు’

30 Apr, 2019 12:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కౌంటింగ్‌ ప్రక్రియకు అధికార తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించే అవకాశం ఉందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి  ఆందోళన వ్యక్తం చేశారు. పాలక పార్టీ ఆటంకాలను ఎదుర్కొనేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ)కు ఆయన లేఖ రాశారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయాలని, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలని కోరారు. అధికార పార్టీ కౌంటింగ్‌ ఏజెంట్లు నకిలీ ఫారం 17 తీసుకువచ్చే అవకాశం ఉందని, ఇలాంటి క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని  ఈసీ ప్రకటించాలని అన్నారు.

ఇక కౌంటింగ్‌ జరిగే వరకూ ఎన్నికల పరిశీలకులు కౌంటింగ్‌ హాల్‌లోనే ఉండాలని, లేనిపక్షంలో రిటర్నింగ్‌ అధికారులపై అధికార పార్టీ ఏజెంట్లు ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉందని విజయసాయిరెడ్డి  ఆందోళన వ్యక్తం చేశారు. కౌంటింగ్‌ ఏజెంట్ల నియామక ప్రక్రియను ముందుగానే పూర్తిచేయాలని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కౌంటింగ్‌ ఏజెంట్లకు ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు సృష్టించి ఆలస్యం చేసే కుట్రపన్నుతున్నారని ఈసీకి నివేదించారు. ఈవీఎంల వద్ద మెష్‌తో పాటు స్టీల్‌ బారికేడ్లు కూడా ఏర్పాటు చేయాలని కోరారు.


మరిన్ని వార్తలు