కరోనాతో దెబ్బతిన్న ఏపీని ఆదుకోండి : విజయసాయిరెడ్డి

8 Apr, 2020 15:31 IST|Sakshi

సాక్షి,విశాఖపట్నం : కరోనా వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వం తరపున‌ ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తక్షణమే రూ. 6200 కోట్ల సాయాన్ని ఏపీకి అందించేలా చూడాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా ,19 రాష్ట్రాలలో 78 హాట్ స్పాట్ ప్రాంతాలను గుర్తించారన్నారు. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా హాట్స్పాట్లు ఉన్న ప్రాంతాలలో లాక్‌డౌన్ కొనసాగించాలని.. మిగిలిన ప్రాంతాలలో దశల వారీగా ఎత్తివేయాలని‌ కోరామన్నారు. ఇండియా నుంచి విదేశాలకు వెళ్లి చిక్కుకుపోయిన వారికి కరోనా టెస్టులు చేసి నెగటివ్ వచ్చిన వారిని స్వస్ధలాలకి పంపాలని కోరినట్లు తెలిపారు. డొమెస్టిక్ శానిటేషన్ పద్దతులపై ప్రజలకి చైతన్యం కలిగించే విధంగా ప్రసార మాధ్యమాల ద్వారా కార్యక్రమాలు రూపొందించాలని కోరామన్నారు.

డ్వాక్రా మహిళలకి మాస్క్ లు, గ్లౌవ్స్ ఏ విధంగా తయారు చేయాలనేది టీవీల ద్వారా శిక్షణ ఇవ్వాలని సూచించామన్నారు.  మన రాష్ట్రానికి ప్రధాని‌ మోదీ అందిస్తున్న సాయానికి ప్రభుత్వం తరపున కృతజ్ణతలు తాను కృతజ్ఞతలు తెలిపినట్లు పేర్కొన్నారు. ప్రధాని‌ మోదీ గతంలోనే ప్రారంభించిన స్వచ్చ భారత్ కార్యక్రమం వల్ల చాలా మేలు జరిగిందని తెలిపారు. మన రాష్ట్రంలో ఉన్న ఎంపీల రెండు సంవత్సరాల జీతాన్ని మన రాష్ట్ర సిఎం సహాయనిధికి అందించేలా సూచించినట్లు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఏపీకి అవసరమైన అన్ని వైద్య పరికరాలని సమకూర్చమని కోరారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న1.50 కోట్ల కార్డుల రేషన్ పంపిణీలో రూ.900  కోట్లు అదనంగా భారం పడుతుందన్నారు. అలాగే వెయ్యి రూపాయిల పంపిణీ ద్వారా మరో 500 కోట్ల లోటు కనిపిస్తుందన్నారు. మొత్తం రూ.1400కోట్లు సాయం చేయడంతో పాటు నెలవారీగా కోల్పోయిన రూ. 4800 కోట్ల ఆదాయాన్ని ఆర్థికంగా సాయం అందించాలని కోరినట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు.

మరిన్ని వార్తలు