ఏపీలో ఎయిరిండియా సర్వీసుల పునరుద్ధరణ

15 Oct, 2019 11:21 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రద్దు చేసిన ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను పునరుద్ధరిస్తామని సంస్థ చైర్మన్‌ అశ్వనీ లొహానీ పేర్కొన్నారు. సర్వీసుల పునరుద్ధరణతో పాటుగా విజయవాడ-తిరుపతి-వైజాగ్, విజయవాడ-షిర్డీ, విజయవాడ-బెంగుళూరు రూట్లలో కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభించే ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం ఢిల్లీ-విజయవాడ మధ్య వారానికి మూడుసార్లు నడుపుతున్న ఎయిర్ ఇండియా విమాన సర్వీసును అక్టోబర్ 27 నుంచి ఢిల్లీ-విజయవాడ-తిరుపతి-విజయవాడ-ఢిల్లీ సర్వీసుగా నడపనున్నట్లు తెలియచేశారు. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ నాయకుడు విజయసాయిరెడ్డికి రాసిన లేఖలో ఈ అంశాలను పేర్కొన్నారు. 

కాగా గత జూలైలో ఆంధ్రప్రదేశ్‌లోని అనేక రూట్లలో ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో విమాన ప్రయాణీకులను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో  ఎయిర్ ఇండియా చైర్మన్ లొహానీతో విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. రద్దు చేసిన విమాన సర్వీసులను సత్వరమే పునరుద్ధరించడంతో పాటు వైజాగ్-విజయవాడ-బెంగుళూరు, వైజాగ్-విజయవాడ-తిరుపతి మధ్య రోజూ విమాన సర్వీసులను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా విజయవాడ, వైజాగ్, తిరుపతి, విజయవాడ-షిర్డీ, విజయవాడ-బెంగుళూరు మధ్య కొత్త విమాన సర్వీసులను ప్రారంభించాలని కూడా కోరుతూ ఆయనకు లేఖ రాశారు. ఈ లేఖపై సానుకూలంగా స్పందిస్తూ లొహానీ మంగళవారం విజయసాయిరెడ్డికి ప్రత్యుత్తరమిచ్చారు. కాగా ఎయిర్‌ ఇండియా నిర్ణయం పట్ల విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా చైర్మన్ అశ్వనీ లొహానీకి ధన్యవాదాలు తెలియజేశారు.
 

మరిన్ని వార్తలు