దీక్ష ఖర్చు నాయుడు బాబు జేబులోదా?

11 Feb, 2019 20:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీక్షపై వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్‌లో స్పందించారు. దీక్ష కోసం భారీగా ఖర్చు చేసిన చంద్రబాబు.. ఆ డబ్బా తన జేబులోదా? లేక ప్రజలదా? అని ప్రశ్నించారు. ప్రజల సొమ్ము కాబట్టే ఆయన విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ‘ ఒకవైపు అప్పుల కోసం భిక్షాటన. మరోవైపు కోట్ల ఖర్చుతో ఢిల్లీలో దీక్ష.. ప్రత్యేక రైళ్ళకు కోటి 12లక్షలు. 200 మందికి ఫ్రీగా ఫ్లైట్‌ టిక్కెట్లు. భోజన వసతికి కోటి. ఢిల్లీలో మరుగుదొడ్లపై బాబు పోస్టర్లకు 35లక్షలు. చార్టర్డ్‌ ఫ్లైట్‌ ఖర్చు అదనం. ఇది నాయుడుబాబు జేబులో డబ్బా? కాదు ప్రజల సొమ్ము.. విచ్చలవిడిగానే పెడతాడు మరి!’ అని విజయసాయిరెడ్డి చురకలు అంటించారు. ‘మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్, రాహుల్‌ గాంధీపై గతంలో శివాలెత్తిన చంద్రబాబు.. చేవిలో జోరిగలా మరతారా? చంద్రబాబు దీక్ష విమానంలో బీజేపీ ఎంపీ ప్రయాణం వెనుక మతలబేంటీ? హైదరాబాద్‌ కంటే అమరావతిలో మెట్రో అన్నమాట మరిచిపోయారా’’ అంటూ చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.

>
మరిన్ని వార్తలు