ప్రార్థనా మందిరానికి పాఠశాల స్థలమా?

16 Dec, 2017 20:03 IST|Sakshi

ఎమ్మెల్యే వంశీపై గ్రామస్తుల ఆగ్రహం

కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయం

విజయవాడ: ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని ప్రార్థనా మందిరానికి కేటాయించడాన్ని ఆ గ్రామస్తులు నిరసిస్తున్నారు. ఎమ్మెల్యే తీరుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఈ సంఘటన విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో జరిగింది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన 20 సెంట్ల భూమిని ప్రార్థనా మందిరం నిర్మించుకునేందుకు గన్నవరం ఎమ్మెల్యే వంశీ కేటాయించారు. దీంతో ఆ భూమిని పొందినవారు దాన్ని స్వాధీనం చేసుకునేందుకు యత్నించారు. ఎమ్మెల్యే వంశీ నిర్ణయంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల స్థలాన్ని ఏ అధికారంతో మతపరమైన కార్యక్రమాలకు కేటాయిస్తారని  ప్రశ్నిస్తున్నారు. ఆ స్థలంలో హైస్కూల్‌కు అనుబంధంగా జూనియర్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీలను నిర్మించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. హైస్కూల్ గ్రౌండ్‌లో గ్రామస్తులు సమావేశమై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించారు. హైస్కూల్ వద్ద ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన చేపట్టగా పోలీసులు రంగంలోకి దిగారు. విజయవాడ సబ్ కలెక్టర్, రూరల్ తహసీల్దార్‌లు సంఘటనా స్థలానికి బయల్దేరి వెళ్లారు.

మరిన్ని వార్తలు