వీరభద్రస్వామికి కన్నీటి వీడ్కోలు

13 Sep, 2014 02:40 IST|Sakshi
వీరభద్రస్వామికి కన్నీటి వీడ్కోలు

రామవరప్పాడు : రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందిన హీరో రాజేంద్రప్రసాద్ సోదరుడు గద్దె వీరభద్రస్వామి మృతదేహం పోస్టుమార్టం అనంతరం శుక్రవారం ప్రసాదంపాడులోని అతని స్వగృహనికి చేరుకుంది. డ్రగ్స్ అండ్ కంట్రోల్ అడ్మినిస్టేటివ్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న వీరభద్రస్వామి మంగళవారం రాత్రి రామవరప్పాడు బళ్ళెం వారి వీధిలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదానికి గురయ్యారు.

ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమవడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందిన విషయం విధితమే. వీరభద్రస్వామి కూతురు, కొడుకు కెనడాలో ఉండడంతో వారు వచ్చే వరకూ పోస్టుమార్టం వాయిదా వేశారు. తండ్రిని కడసారి చూసుకునేందుకు కూతురు, కొడుకు శుక్రవారం నగరానికి చేరుకున్నారు. ప్రభుత్వాస్పత్రిలోని మృతదేహన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని బంధువులు, సన్నిహితుల సందర్శనార్థం గ్రామానికి తీసుకోచ్చారు.

సినీ హిరో రాజేంద్రప్రసాద్ విగతజీవిగా మారిన తన సోదరుడ్ని చూసి కన్నీటి పర్యంతరమయ్యారు. మృతదేహనికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, మృతుడికి చిన్ననాటి మిత్రుడైన నగర మేయరు కోనేరు శ్రీధర్, మృతుడి సహ ఉద్యోగులు, స్నేహితులు, మృతదేహనికి పూలమాలలు వేశారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.
 

మరిన్ని వార్తలు